30 October 2013

ఇస్లామిక్ బ్యాంకింగ్


          సామ్రాజ్యవాద ప్రపంచీ కరణ, సంక్షోభంలో కూరుకు పోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ బ్యాంకింగ్‌ గురించిన చర్చ తెరమీదకు వచ్చింది. ఈ చర్చల్లో “ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌” ప్రాధాన్యతను సంతరించుకుంది.. ఇస్లామిక్ బ్యాంకింగ్ అనే పదం ఈమద్య తరచుగా వార్తలలో వినిపిస్తున్నది.  కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ రహమాన్ ఖాన్, ఆర్.బి‌.ఐ . గవర్నర్ శ్రీ రఘు రామ్ రంగరాజన్ ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను మన దేశంలో ప్రవేశ పెట్టాలని ఆలోచించుచున్నారు. భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ ఇటీవల తమ మలేసియా పర్యటనలో అక్కడి ఇస్లామిక్ బ్యాంక్ పనితీరుతెన్నులను పరిశీలించి, మన దేశం లో అలాంటి బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టటానికి మార్గాలు ఆలోచించమని ఆర్.బి.ఐ.ను కోరినారు.
          దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచినా అభివృద్ధిలో అట్టగున ఉన్నముస్లింలను  ఆర్థికంగా అభివృద్ధి చేయడం ద్వారా  వారి వెనుకబాటు తనాన్ని రూపుమాపాలనే  ఉద్దేశంతో యూపీఏ సర్కారు ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా 75 దేశాల్లో సత్ఫలితాలిస్తున్న ఇస్లామిక్‌ బ్యాంకులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇస్లామిక్‌ బ్యాంకులు తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఈ బ్యాంకులు ఇస్లామిక్‌ షెరియానిబంధనలకు లోబడి పనిచేస్తాయి. స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే ముస్లింలకు ఈ బ్యాంకులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా రుణాలు ఇస్తాయి. ఆర్థికంగా లాభం వచ్చే రంగాల్లో ఇవి పెట్టుబడులు పెట్టిస్తాయి. ఎలాంటి వడ్డీ లేకుండా షెరియా నిబంధనల ప్రకారమే రుణాలందజేస్తాయి.
ఇస్లామిక్ బ్యాంకింగ్- ప్రధాన సూత్రాలు:
          షరియా సూత్రాలపై ఆధారపడి లాభ,నష్టాలు పంచుకొనే విధానం(ప్రాఫిట్ అండ్ లాస్  షేరింగ్) పై ఆధారపడి పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థను ఇస్లామిక్ బ్యాంకింగ్ గా పేర్కొనవచ్చును. షరియత్ చట్టాలను గౌరవిస్తూ, ఆ సూత్రాలకు అనుగుణంగా నడుచుకునే బ్యాంకులను ఇస్లామిక్ బ్యాంకులు అనవచ్చును.
          ఇస్లాం మత  సూత్రాల ప్రకారం వడ్డీ (రిబా) విధించడం, చెల్లించడం నిషేధం. పెట్టుబడికి సమానమైన రొక్కాన్ని మాత్రమే రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించాలి అంటే వెయ్యి దినార్ల బంగారం రుణంగా ఇస్తే అంతే బరువైన బంగారు కాయిన్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. షరియత్‌ సూత్రాలననుసరించి వడ్డీ(రిబా) నిషేధంతో అన్ని ఇస్లామిక్‌ బ్యాంకులు వడ్డీరహిత సూత్రాన్ని విధిగా పాటిస్తున్నాయి. ఈ బ్యాంక్ లు వర్తక, వాణిజ్యం, సామాజిక అబివృద్ధి వంటి ఉత్పాదక కార్యకలాపాలకు ఊతం ఇస్తాయి. షరియత్ లో  నిషిద్దమైన వ్యాపారాల్లో పెట్టుబడులను ఆ బ్యాంకులు  పెట్టవు.   
          ఇస్లామిక్ బ్యాంకుల  లోని  కరెంట్‌ ఎకౌంట్‌ ఖాతాలు సాంప్రదాయ బ్యాంకులలోలాగా ఉండి, డిపాజిట్‌దారుల అనుమతితో వారి సొమ్మును ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు వస్తే పంచుతున్నారు, నష్టాలు వస్తే భరించవలసి ఉంటుంది.   షరియత్‌ సూత్రాలననుసరించి జూద ప్రవృత్తి గల రంగాలలో పెట్టుబడులు నిషేధించిన కారణంగా బ్యాంకింగ్‌ పెట్టుబడులు  అత్యధిక రిస్కు కలిగిన రంగాలకు విస్తరించకపోవటం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌కు రక్షణగా ఉంది.
ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆవిర్భావం:
          ఇస్లాం  మత సూత్రాల ప్రాతిపదికన నిర్వహించబడే ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఉనికి లోనికి వచ్చింది. 1200 సంవత్సరాల క్రితం బాగ్దాద్‌, డెమస్కస్‌, ఫెజ్‌ మరియు కోర్డోబాలలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి
          ఆధునిక ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థకు ఆద్యుడిగా మీర్జా బషీర్-ఉద్దీన్-మహమూద్ అహమ్మద్ ను పేర్కొనవచ్చును. ఇతడు తాను వ్రాసిన “నిజామే నౌ”(NIZAME NAU 1942), “ఇస్లాంకా నిజామ్ఇక్తీసది” (ISLAM KA NIZAAM IQTISADI 1945)  గ్రంధాలలో ఇస్లామిక్ ఆర్థిక వ్యవస్థ మూలసూత్రాలు వివరించాడు. ఆ తరువాత నయీమ్ సిద్దికి(1961), మౌలానా మదూది,మహమ్మద్ హమీదుల్లా(1944),ముహమద్ ఉజైర్(1955),అబ్దుల్లా అల్-అరబీ(1967), అల్-నజ్జర్(1971), తమ రచనలలో  “ముదరభా” అనగా లాభ,నష్టాలు పంచుకొనే విధానం(ప్రాఫిట్ అండ్ లాస్  షేరింగ్)  గురించి  వివరించినారు. మహమ్మద్ బకీరుల్ సదర్ (1961) రచన IQTISADUNA (మై ఏకనామిక్స్) ఆధునిక  ఇస్లామిక్  బ్యాంకింగ్ విధానం పై వ్రాయబడిన ప్రముఖ గ్రంధం గా పేర్కొనవచ్చును.
          ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ సంస్థలు 1960లో పిలిగ్రిమ్స్‌ ఫండ్స్‌ రూపంలో మలేషియాలో ఆవిర్భవించినాయి.,. 1963 లో ఈజిప్ట్ లోని మిట్ఘమర్ (Mitghamr) అనే పట్టణంలో అహ్మద్ ఎలాంగ్గర్ లాభ-నష్టాల పంపిణిపై ఆధారపడి పనిచేసే మిట్‌మర్‌ సేవింగ్స్ బ్యాంక్ ను స్థాపించాడు. 1981 నాటికి ఈజిప్ట్ లో ఇలాంటి బ్యాంక్ ల సంఖ్య 9కు చేరింది ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొంది, “మొరాబాహ” పై విస్తృతంగా వ్రాసిన  సమీ  హాసన్ హొమౌద్  అనే జోర్డాన్ దేశస్థుడు 1978 లో జోర్డాన్ ఇస్లామిక్  బ్యాంకు ను స్టాపించాడు. 1974లో దుబాయి ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఆవిర్భవించింది. 1974లో ఏర్పాటు చేయబడ్డ ఇస్లామిక్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వివిధ దేశాలలోని ఇస్లామిక్‌ బ్యాంక్‌ల కార్యకలాపాలను అనుసంధానం చేస్తూ 1976 నుండి తన కార్యక్రమాలను విస్తృత పరచింది  
ఇస్లామిక్ బ్యాంకుల ప్రస్తుత స్థితి
13వ శతాబ్దంలో ప్రారంభమైన ఇస్లామిక్‌ బ్యాంకులు 1960 దశకంలో విస్తరణ బాట పట్టాయి..  ప్రపంచవ్యాప్తం గా ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితులలో కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా 75 దేశాల్లో వడ్డీలేని రుణాలు ఇస్తున్న ఇస్లామిక్‌ బ్యాంకులు అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉన్నాయి. మానవ వనరులను సమృద్ధిగా వినియోగించుకుంటూ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతున్న ఇస్లామిక్‌ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కుదిపేసిన ఆర్థిక మాంద్యాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొన్నాయి. ప్రపంచ పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు పెట్టింది పేరైన అమెరికా బ్యాంకు మాంద్యం దాటికి విలవిల్లాడితే ఇస్లామిక్‌ బ్యాంకులు మాత్రం పురోభివృద్ధిలోనే సాగాయి.
          ఇస్లామిక్‌ బ్యాంకులు సాలీన పది నుంచి శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తూ వాణిజ్య బ్యాంకులకు దీటుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అనేక కొర్రీలు పెడుతూ వడ్డీలకు చక్రవడ్డీలు జోడించి రుణ గ్రహీతలను పీల్చిపిప్పి చేస్తుంటే ఇస్లామిక్‌ బ్యాంకులు మాత్రం అడిగిన వారికల్లా రుణాలు ఇస్తూ లాభాపేక్షలేని వ్యాపారంతోనే ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. ఈ కాలంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకులు సైతం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ డివిజన్లను ఏర్పాటు చేశాయి. అమెరికా, బ్రిటన్, జర్మని, ఫ్రాన్స్, సింగపూర్ వంటి అనేక దేశాల్లో వాటి సేవలు ప్రారంభమయ్యాయి.ఇటీవల ఆర్థిక మాంద్యంలోను ఇస్లామిక్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం మంచి పని తీరును కనబర్చడంతో మరికొన్ని దేశాలు దీనిపై ఆసక్తి చూపుతూన్నాయి
          ఈ వడ్డీ రహిత ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 400-500 ఇస్లామిక్ బ్యాంకులు,250 మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ప్రస్తుతం ఒక లక్ష కోట్ల డాలర్ల వ్యాపారంను నిర్వహిస్తున్నాయి, సేవలందిస్తున్నాయి. 2005 నాటికి ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా 822 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేసినట్టు ద ఎకనామిస్ట్‌ పేర్కొంది. ఈ మొత్తం వ్యాపారం రియా నిబంధనలకు లోబడే సాగించినట్లు తేల్చింది. ఇస్లామిక్‌ బ్యాంకులు 2012 నాటికి 1.10 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించినట్లుగా అంతర్జాతీయ ఆర్థిక సర్వేలు వెల్లడించాయి.2013 లో ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకింగ్ సంస్థల ఆస్తులు 1.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుకొన్నట్లు అంచనా.2015 నాటికి గల్ఫ్ ప్రాంతంలోనే ఇస్లామిక్ బ్యాంకుల ఆస్తులు 990 బిలియన్ డాలర్లకు చేరవచ్చునని ఆర్ధిక వేత్తలు  అంచనా వేస్తున్నారు. ఒక్క పశ్చిమ ఆసియా ప్రాంతంలో 2020 నాటికి ఇది తొమ్మిది లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెంట్ మెకెంజీ అంచనా వేసింది

           ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక తిరోగమన పరిస్థితులన్నా ఇస్లామిక్‌ బ్యాంకులు 2014 నాటికి  మరింత పురోగమనంలోకి వెళ్తాయని ఆశిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి తట్టుకొని నిలబడిన ఇస్లామిక్‌ బ్యాంకులను మన దేశంలోనూ ప్రవేశపెట్టి ముస్లింల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని కేంద్రం వ్యూహాలు రచిస్తోంది

19 October 2013

విభజన అనివార్యం ఐనా సీమాంద్ర ప్రాంతం (ఆంధ్ర ప్రదేశ్) లో ముస్లిం లు నిర్వహించవలసిన పాత్ర – ఆంధ్ర ప్రదేశ్ లో అనగా సీమాంద్ర ప్రాంతం లో ముస్లింల కోరికలు మరియు వారి న్యాయ బద్ధ డిమాండ్లు


        రాష్ట్రం లో జరుగుతున్నా నవీన పరిణామాలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తద్యము అని స్పష్టమగుచున్నది. రాష్ట్రం విభజించబడిన సీమాంద్ర ప్రాంతంలోని ముస్లింల పరిస్థితులపై చర్చించ వలసి ఉంది. విభజన జరిగిన సీమాంద్ర ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ గాను, తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం గాను పిలవ బడుతుంది..
          రాష్ట్ర విభజన వలన సీమాంద్ర ముస్లింలు ఎటువంటి బయాందోళనకు గురికావలసిన స్థితి లేదు. తక్షణ కర్తవ్యం విభజన జరిగిన దాని నుంచి ఏవిధంగా అత్యధిక ప్రయోజనం పొందాలో ఆలోచించ వలసి ఉంటుంధి  ఒక్క ఉత్తర ఆంధ్రా  ప్రాంతం  తప్పితే విభజన జరిగే  ఆంధ్రప్రదేశ్ లో (సీమాంద్ర ప్రాంతంలో )ముస్లింల జనసంఖ్య ఆ  రాష్ట్ర జనాభాలో 20-25% వరకు ఉంటుంది మరియు నూతన రాజధాని కర్నూల్, ఒంగోల్ , విజయవాడ వంటి ఏ ప్రాంతం లో ఏర్పడిన ఆ ప్రాంతానికి 50 కి.మి. వ్యాసార్ధంలో పల్లెలు,పట్టణాలలో ముస్లింలు తగినంత సంఖ్య లో ఉన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన శ్రామిక శక్తి మొత్తాన్ని అంధించే సంఖ్యలో ముస్లిం శ్రామికులు కలరు. ముస్లిం ల జీవితాలలో అభివృద్ధి కన్పిస్తుంది.
          ఆంధ్ర ప్రదేశ్ (సీమాంద్ర) పునర్నిర్మాణం లో ముస్లింలు ప్రధాన పాత్ర వహించవలసి ఉంటుంది. రాజకీయ అధికారం అందకపోయినా ఆర్థిక, సామాజిక, విద్యా రంగాలలో ప్రగతి సాదించవలసి ఉంటుంది. ఇందుకు గాను  ముస్లిం లు తమ అబివృద్ధి ,సంక్షేమం కోసం నూతనం గా ఏర్పడే ప్రభుత్వాన్ని, వివిధ రాజకీయ పక్షాలను   కొన్ని డిమాండులు చేయ వలసి ఉంటుంది. వాటిని ఈ క్రింద వివరించటం జరిగింది.
1.     ముస్లిం రిజర్వేషన్స్ ను యదాతధం గా కొనసాగించాలి. వీలైతే వాటి శాతం పెంచ వలసి ఉంటుంది.
2.    ఎటువంటి తేడాలు లేకుండా ముస్లింలు అందరికీ విద్యా, ఉపాది, రంగాలలో  రిజర్వేషన్ కల్పించాలి –సయ్యద్,పఠాన్,మొగలు లకు కూడా
3.    సచార్ కమిటీ, రంగనాధ మిశ్రా కమిటీ,కృష్ణన్ కమిటీ  నివేదికలను యధాతధంగా అమలు పరిచేటట్లు వత్తిడి చేయ వలసి ఉంటుంది.
4.    ముస్లిం ఉద్యోగులు మరియు అందరూ ఉద్యోగులకు జోనల్ సిస్టమ్ యదాతధంగా కొనసాగించాలి- 371డి నిబంధన కొనసాగింపు.
5.    ఉర్దూ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
6.    ప్రధాన మంత్రి 15 సూత్రాలమైనారిటీ అబివృద్ధి  పధకాన్ని అన్నీ జిల్లాలలో కనీసం 20% ముస్లిం జనాభా ఉన్న జిల్లాలకు  వర్తింప చేయాలి.
7.    రాష్ట్ర పోలీస్,పారా మిలిటరీ దళాలలో తగ్గుతున్న ముస్లింల భర్తీ శాతాన్ని పెంచాలి.
8.    రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, సహకార బ్యాంకులు, ఆర్.టి.సి. ,మున్సిపాలిటీ, వంటి సంస్థల నియమకాలలో ముస్లింలకు తగిన స్థానం కల్పించాలి.
9.    రాష్ట్ర శాసన సభ మరియు శాసన మండలిలో గవర్నర్ నామినేట్ చేసే వ్యక్తి ముస్లిం అయి ఉండాలి.
10.  ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ల , నామినేటెడ్ పోస్టుల నియామకం లో ముస్లింలకు ఆదిక ప్రాధాన్యం కల్పించాలి.
11.   సీమాంద్ర ప్రాంతం లోని  ప్రతి జిల్లా నుండి కనీసం ఇరువురు ముస్లింలను అబ్యర్ధులుగా అన్నీ రాజకీయ పక్షాలు  కేటాయించాలి.
12.  రాష్ట్ర మంత్రి వర్గములో కనీసం 5-10% స్థానాలు, హోమ్,ఆర్థిక, వ్యవసాయం వంటి శాఖలలో కనీసం 2 శాఖలను ముస్లిం లతో భర్తీ చేయాలి.
13.  అన్నీ సీమాంద్ర స్థానిక సంస్థల ఎన్నికలలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలి.
14.  రాయలసీమ, దక్షిణ కోస్తా లో అన్నీ జిల్లాలలో ఉర్దూను ద్వితీయ అధికార భాషగా ప్రకటించాలి.
15.  ఉర్దూ మీడియం పాటశాలలను అధికంగా ఏర్పాటు చేసి, ఉర్దూ టీచర్ల సంఖ్యను పెంచాలి. ఉర్దూ టీచర్ల నియామకం లో రిజర్వేషన్లను పాటించకుండా, ముస్లిం అభ్యర్ధులతోనే వాటిని భర్తీ చేయాలి.
16.  సీమాంద్ర ప్రాంతం లోని అన్నీ మదర్శాలను సర్వశిక్ష అబియన్ పరిదిలోనికి తెచ్చి,వాటిలోని విద్యార్ధు లకు మద్యాన్న భోజన పదకాన్నివర్తింపచేయాలి.
17.  ఉర్దూ బాష అబివృద్ధికి ఉర్దూ అకాడెమిని స్టాపించాలి.
18.  ముస్లిం బాల బాలికలకు   నిర్బంధ ప్రాధమిక ఉచిత విద్యా విధానం అమలు జరపాలి,
19.  ముస్లిం విద్యార్ధులంధరికి స్కాలర్ షిప్  ఇవ్వాలి. ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలి.
20. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్ధులకు, విదేశాలలో విద్యా అభ్యసించే, ముస్లిం విద్యార్ధులకు  ప్రభుత్వం ఉచిత ఆర్ధిక సహాయం కల్పించాలి.
21.  ముస్లిం విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా పోటీ పరీక్షల శిక్షణ నిమిత్తం అన్నీ జిల్లాలలో  స్టడీ సర్కిల్ స్టాపించాలి.
22.  ముస్లిం విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ సాంకేతిక విద్యాలయలు, (పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజినెరింగ్ కాలేజీలు) స్టాపించవలసి ఉంటుంది.
23.  ముస్లిం యువతకు ఆంగ్లము, మాథ్స్, కంప్యూటర్ లలో ప్రత్యేక శిక్షణ అంధించాలి. గల్ఫ్ ఉద్యోగాల నిమిత్తం అరబ్బీ బాష లో ప్రత్యేక శిక్షణ కల్పించాలి.
24.  ప్రతి పట్టణం, మండల కేంద్రం లో మౌలానా ఆజాద్ పబ్లిక్ లైబ్రరి లను స్టాపించాలి.
25.  ముస్లిం ప్రవేట్  మైనార్టీ విద్యా సంస్థలకు తక్షణమే ప్రభుత్వ గ్రాంటు అందించాలి.
26.  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పధకం, ఇందిరా అవాస పధకం లో గ్రామీణ ముస్లిం జనాభా కు తగినంత ప్రాతినిద్యం కల్పించాలి. జాతీయ ఆహార బద్రత చట్టాన్నిఅందరూ ముస్లింలకు వర్తింప చేయాలి.
27.  రాజీవ్ ఆరోగ్య శ్రీ , రాజీవ్ గృహకల్ప వంటి పధకాలలో ముస్లిం లకు తగినంత ప్రాతినిద్యం కల్పించాలి.
28.  ముస్లిం శ్మశానాల అబివృద్ధి, ఈద్గాల అబివృద్ధి, వాటి చుట్టూ ప్రహరీ,ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలి.
29.  ప్రతి మండలకేంద్రం లేదా పట్టణాలలో షాదీ ఖానాలు, కమ్యూనటి కేంద్రాల ఏర్పాటు జరగాలి.
30. వక్ఫ్ ఆస్తుల పూర్తి సర్వే జరపాలి, అక్రమణకు గురిఐన వక్ఫ్ ఆస్తులను తక్షణం స్వాధీనం చేసుకోవాలి. వక్ఫ్ ఆస్తుల దురాక్రమణలు సమర్ధవంతంగా నిరోదించాలి.
31.  సీమాంద్ర ప్రాంతం కోసం ప్రత్యేకంగ హజ్ హౌస్ నిర్మాణం జరపాలి మరియు సీమాంద్ర ప్రాంతం నుండి హజ్ కు వెళ్ళే ముస్లింల కోటా పెంచాలి.
32.  మసీద్ లో పనిచేసే ఇమామ్, మౌజన్ లను  ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు ఇవ్వాలి (యూ.పి. లో లాగా)
33.  చౌక డిపోల డీలర్ల నియమకంలో తగిన ప్రాధాన్యత కల్పించాలి.
34.  మునిస్పాలిటీ,కార్పొరేషన్, ఇరిగేషన్, ఆర్&బి‌ వంటి ప్రభుత్వ శాఖలు నిర్మించి వేలంవేసే దుకాణాలలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలి.
35.  ఆటొ నగర్ లోని దుకాణాలు, స్థలాల కేటాయింపు లో ముస్లింలకు  అధిక ప్రాధాన్యత కల్పించాలి.
36.  ముస్లిం జనసంఖ్య అదికంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో వారికోసం ప్రత్యేకం గా ఉర్దూ పాటశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పశువైద్య శాలలు నిర్మించాలి.
37.  హెల్త్ వర్కర్లు , అంగన్వాడీ కార్యకర్తలలో ముస్లిం స్త్రీలకు ప్రాతినిద్యం  ఎక్కువుగా వ్ందాలి. ముస్లిం జనానా (స్త్రీల)కోసం ప్రత్యేకంగ వైద్యశాలలు, చిన్న పిల్లల ఆసుపత్రులు నిర్మించాలి.
38.  ప్రతి జిల్లాకు ముస్లిం మైనారిటీ ఆఫీసర్ ఏర్పాటుచేసి, ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా నిరుపేద ముస్లింలకు ఆర్థిక సహాయం కల్పించాలి.
39.  ముస్లిం నిరుద్యోగులకు, యువతకు, స్వయం ఉపాధి కల్పించుకోవటానికి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పించాలి.
40. ఆర్థికంగా పేద వారు ఐనా ముస్లింలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, బంజరు భూముల పంపిణీ జరగాలి.
41.  MEMPA వంటి పట్టణ పేదప్రజల అబివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పట్టణ నిరుపేద ముస్లిం యువతీ,యువకులకు వృతి శిక్షణ, టైలరింగ్, కుట్టు అల్లికలు వంటి వాటిలో శిక్షణ అంధించవలసి ఉంటుంది.
42.  వికలాంగులు, విధవలు, వృద్ధులు ఐనా ముస్లింలకు  పెంక్షన్ సదుపాయం ఉండాలి.
43.  కేంద్ర, రాష్ట్రాల అన్నీ రకాల సంక్షేమ పధకాలను ముస్లిం లు పూర్తిగా వినియోగించుకొనేటట్లు అవగాహన కల్పించి వాటి ప్రయోజనం పొందేటట్లు చూడాలి.
          పైన వివరించిన డిమాండ్ల ను ప్రభుత్వం,వివిధ రాజకీయ పక్షాల  ముందు ఉంచి, వాటిని సాదించేటట్లు ముస్లింలు  ప్రభుత్వం పై ,రాజకీయ పక్షాలపై ,వత్తిడి,లాభీ చేయవలసి ఉంటుంది. దీనికి గాను అందరూ ముస్లిం సోదరి,సోదరులు సహకరించవలసి ఉంటుంది.