22 February 2023

శివాజీ- సెక్యులర్ పాలకుడు

 

ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరును మహారాష్ట్రలో చాలా గర్వంగా మరియు గౌరవంగా తీసుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న శివాజీ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. శివాజీ మహారాజ్ జూన్ 6, 1674 న వేలాది మంది ప్రజల సమక్షంలో రాయగడ కోటలో పట్టాభిషేకం పొందినారు.

సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు న్యాయం యొక్క విలువల ఆధారంగా స్వరాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు.

ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు మరియు సంస్థలు  తమ స్వార్థ ప్రయోజనాల కోసం శివాజీ మహారాజ్‌ ను హిందూ రక్షకుడిగా  చిత్రీకరిస్తున్నారు. శివాజీ మహారాజ్‌ను కేవలం మత రక్షకుడిగా చూడడం అంటే శివాజీ స్థాయిని తగ్గించడమే. శివాజీ జీవితం ఉన్నత ఆశయాలను అనుసరించి సాగింది.

శివాజీ మహారాజ్‌ సెయింట్స్, పీర్ ఔలియాలు మరియు అన్ని మతాలను గౌరవించాడు. ఈ కారణంగా, శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించినప్పుడు, స్థానిక మరాఠాలతో పాటు, పెద్ద సంఖ్యలో ముస్లింలు కూడా శివాజీ కి మద్దతు ఇచ్చారు. శివాజీ పోరాడిన యుద్ధాల్లో వేలాది మంది ముస్లింలు శివాజీ తరుపున పాల్గొన్నారు; నేటికీ కొల్హాపూర్, సతారాలోని ముస్లింలు శివాజీ జయంతి ఊరేగింపుల్లో కోలాహలంగా పాల్గొంటారు.

శివాజీ మహారాజ్ హయాంలో ప్రజా సంక్షేమం, న్యాయం, సోదరభావానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే శివాజీని, శివాజీ పాలనను నేటికీ ప్రజలు గుర్తుంచుకుంటారు.

శివాజీ మహారాజ్ కుటుంబం సూఫీ సాధువులను చాలా గౌరవించింది. శివాజీ తాత తన ఇద్దరు కుమారులకు షాజీ మరియు షరీఫ్జీ అని ముస్లిం పీర్ బాబా షా షరీఫ్ పేరు పెట్టారు. శివాజీ మహారాజ్‌కి సూఫీ సెయింట్ బాబా యాకుత్‌పై గొప్ప గౌరవం ఉండేది. శివాజీ యుద్ధానికి బయలుదేరే ముందు యాకుత్‌బాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందేవారు. శివాజీ  సూఫీల వివిధ దర్గాలపై నూనె దీపాలను వెలిగించాడు.

శివాజీ హయాంలో స్త్రీలు గౌరవించబడ్డారు.

శివాజీ మహారాజ్ తన ముస్లిం సైనికులపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. శివాజీ సైన్యంలో 60 వేల మందికి పైగా ముస్లిం సైనికులు ఉన్నారు. శివాజీ బలమైన నౌకాదళాన్ని స్థాపించాడు మరియు దాని కమాండ్ ముస్లిం సైనికుల చేతుల్లో ఉంది. సముద్ర కోటల నిర్వహణ కూడా దర్యా సారంగ్, దౌలత్ ఖాన్, ఇబ్రహీం ఖాన్, సిద్ది మిస్త్రీ వంటి అనుభవజ్ఞులైన ముస్లిం గవర్నర్‌లకు అప్పగించబడింది.

రుస్తామోజ్మాన్, హుస్సేన్ ఖాన్, ఖాసిం ఖాన్ వంటి అనేకమంది ముస్లిం యుద్దవీరులు బీజాపూర్ సంస్థానాన్ని విడిచిపెట్టి, 700 మంది పఠాన్ సైనికులతో పాటు శివాజీ మహారాజ్ సైన్యంలో చేరారు. శివాజీ మహారాజ్‌కు అత్యంత సన్నిహితుడైన సర్దార్లలో సిద్ది హిలాల్ ఒకరు. యుద్ధంలో సిద్ది హిలాల్ ధైర్యసాహసాలు ప్రసిద్ధి చెందాయి.

శివాజీ సైన్యంలో ఉపయోగించిన చాలా ఫిరంగులు ముస్లిం సైనికులచే నిర్వహించబడేవి. ఇబ్రహీం ఖాన్ ప్రధాన గన్నర్; షామా ఖాన్ మరియు ఇబ్రహీం ఖాన్ అశ్విక దళానికి అధిపతిగా ఉన్నారు. శివాజీ అంగరక్షకుల్లో సిద్ది ఇబ్రహీం ఒకరు. అఫ్జల్ ఖాన్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో, సిద్ధి ఇబ్రహీం తన ప్రాణాలను పణంగా పెట్టి శివాజీ మహారాజ్‌ను రక్షించాడు. తరువాత, శివాజీ మహారాజ్,  సిద్ధి ఇబ్రహీం ను ఫోండా కోటకు అధిపతిగా నియమించాడు.

ఆగ్రా కోటలో శివాజీ అరెస్టయినప్పుడు, శివాజీ తప్పించుకోవడంలో మదారి మెహతార్ అనే ముస్లిం వ్యక్తి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. 

పర్షియన్ భాషలో పండితుడైన ఖాజీ హైదర్ శివాజీకి చీఫ్ లా ఆఫీసర్. శివాజీ పరిపాలనలో  ఖాజీ హైదర్ ప్రధాన పాత్రను కలిగి ఉన్నాడు.

శివాజీ మహారాజ్ చేత రాయగఢ్ కోటలోని రాజభవనం ముందు ఒక మసీదు నిర్మించబడింది మరియు అది నేటికీ ఉంది.

అఫ్జల్ ఖాన్ మరణించిన తర్వాత, శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ మృతదేహాన్ని ఇస్లామిక్ మర్యాదలతో ఖననం చేయాలని ఆదేశించాడు. అఫ్జల్ ఖాన్ కోసం ఒక కాంక్రీట్ సమాధి నిర్మించబడింది; అఫ్జల్ ఖాన్ కుమారులు క్షమించబడ్డారు.

శివాజీ మహారాజ్ మరియు మొఘలుల మధ్య జరిగిన యుద్ధం రాజకీయ ప్రయోజనాల కోసం రాజుల మధ్య పరస్పర ఘర్షణ అని అది మత ఆధిపత్యం కోసం కాదని చరిత్ర రుజువు చేస్తుంది.


 

No comments:

Post a Comment