భారతదేశంలో
మొహర్రం ఆచరణ ముస్లింలు మరియు ముస్లిమేతరులలో ఎప్పటినుంచో భక్తి, గౌరవ భావాలను ప్రేరేపిస్తోంది. శతాబ్దాలుగా, ఇమామ్ హుస్సేన్ అమరత్వాన్ని స్మరించుకోవడం మత
సామరస్యానికి మరియు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి ఒక అద్భుతమైన సంప్రదాయంగా
పరిణామం చెందింది.
ప్రపంచవ్యాప్తంగా
ఉన్న ముస్లింలు కర్బలాలో ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగానికి సంతాపం తెలుపుతుండగా, భారతదేశంలో మొహర్రం ఆచరణ ప్రత్యేకంగా
నిలుస్తుంది. దేశవ్యాప్తంగా మొహర్రం ఆచారాలలో హిందువులు చురుకుగా పాల్గొనడం దీని
యొక్క అత్యంత విశేషమైన లక్షణాలలో ఒకటి. పట్టణాలలో, గ్రామాలలో హిందువులు కూడా ముస్లింలతో కలిసి
ఇమామ్ హుస్సేన్కు సంతాపం తెలుపుతారు, కర్బలాలోని ఇమామ్ హుస్సేన్ సమాధి ప్రతిరూపాలను మోసుకెళ్లే తాజియా
ఊరేగింపులలో పాల్గొని మద్దతు ఇస్తారు.
భారతదేశ
జనాభాలో అధిక శాతం ముస్లిమేతరులే అయినప్పటికీ, మొహర్రం వేడుకలలో వివిధ మతాలకు చెందిన ప్రజలు-హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు పాల్గొనడం సర్వసాధారణం.
భారతదేశ
నగరాలలో మొహర్రం
హిందూ
సంప్రదాయానికి ప్రధాన కేంద్రాలలో ఒకటైన వారణాసిలో, మొహర్రంను ఎంతో ఉత్సాహంగా, హిందువుల గణనీయమైన భాగస్వామ్యంతో జరుపుకుంటారు.
ఈ నగరంలోని శివాలా ప్రాంతం, సున్నితంగా
రూపొందించిన తాజియాలకు మరియు ఇమామ్ హుస్సేన్ గుర్రమైన జుల్జనా చిత్రాలకు ప్రసిద్ధి
చెందింది. ఇలాంటి సంప్రదాయాలను లక్నో, ప్రయాగ్రాజ్, కాన్పూర్, హైదరాబాద్, కోల్కతా, ముంబై, చెన్నై, అమ్రోహా, ఇండోర్, నాగ్పూర్, జైపూర్ మరియు భోపాల్లలో కూడా చూడవచ్చు.
భారతదేశంలో
మొహర్రం వేడుకలు పలువురు హిందూ పాలకుల ఆదరణను కూడా పొందాయి. చారిత్రక ఆధారాల
ప్రకారం, దక్షిణ
భారతదేశంలోని విజయనగర రాజులు 16వ మరియు 17వ
శతాబ్దాలలో ఇమాంబర్గాలను నిర్మించి, సంతాప సూచకంగా మొహర్రం మొదటి పది రోజులు నల్లని వస్త్రాలు ధరించేవారు.
గ్వాలియర్కు
చెందిన సింధియాలు, ఇండోర్కు
చెందిన హోల్కర్లు, బరోడాకు
చెందిన గైక్వాడ్లు, మరియు
కొల్హాపూర్, పూణేలకు
చెందిన భోంస్లేలతో సహా మరాఠా రాజవంశాలు కూడా మత సామరస్యాన్ని పెంపొందించే సాధనంగా
మొహర్రం వేడుకలకు మద్దతు ఇచ్చాయి. వారిలో, ఇమామ్ హుస్సేన్ త్యాగానికి గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం ఆషూరా ఊరేగింపులలో
గ్వాలియర్ మహారాజు చెప్పులు లేకుండా నడవడం విశేషం.
లక్నో:
మొహర్రం ఉత్సవాల కేంద్రం
అవధ్ నవాబుల
పూర్వ రాజధాని అయిన లక్నో, భారతదేశంలో
మొహర్రం వేడుకలకు అత్యంత ముఖ్యమైన కేంద్రాలలో ఒకటిగా నిలుస్తుంది. పెద్ద సంఖ్యలో
హిందువులు షియా సంతాప ఊరేగింపులలో పాల్గొంటారు, మరికొందరు ముస్లింలతో పాటు ఉపవాసాలు పాటిస్తారు. ఇంకొందరు పాల్గొనేవారికి
షర్బత్, పాలు పంపిణీ
చేస్తారు.
కొంతమంది
హిందువులు 'ఆగ్ కా మాతం' అనే ఆచారంలో కూడా పాల్గొంటారు, ఇందులో వారు 'యా హుస్సేన్' అని జపిస్తూ మండుతున్న నిప్పుల మీద నడుస్తారు.
లక్నో నగరంలో
హిందూ నాయకత్వంలోని అనేక అంజుమన్లు (మత సంస్థలు) ఊరేగింపులు మరియు స్మారక సభలను
నిర్వహిస్తాయి. 1880లో బషీరత్గంజ్లో
స్థాపించబడిన కృష్ణో ఖలీఫా కా ఇమాంబారాతో సహా, హిందువుల యాజమాన్యంలోని ఇమాంబర్గాలు కూడా ఉన్నాయి.
అంజుమన్-ఎ-హింద్-ఎ-అబ్బాసియా మరియు అంజుమన్-ఎ-సకీనా వంటి సంస్థలు మొహర్రం
ఉత్సవాలలో చురుకైన పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. రాజా టికెట్ రాయ్ మరియు రాజా
బిలాస్ రాయ్లతో సహా లక్నోకు చెందిన ప్రముఖ హిందూ ప్రభువులు కూడా ఇమాంబర్గాలను
నిర్మించి, మత
పండితులను పోషించారు.
మధ్యప్రదేశ్:
అనేక జిల్లాలలో, శర్మలు
మరియు రైక్వార్ల వంటి హిందూ కుటుంబాలు ఒక శతాబ్దానికి పైగా మొహర్రం ఊరేగింపులను
నిర్వహిస్తున్నాయి. ఈ సంప్రదాయం 1882లో విదిషాకు చెందిన రైక్వార్ కుటుంబంతో ప్రారంభమైందని చెబుతారు. సెహోర్లోని
మిశ్రా కుటుంబానికి కూడా మొహర్రం ఉత్సవాలతో శతాబ్దాల నాటి అనుబంధం ఉంది.
తమిళనాడు:
పల్లిమన్కలం వంటి గ్రామాలలో పెద్ద సంఖ్యలో హిందువులు మొహర్రం ఊరేగింపులలో
పాల్గొంటారు. హిందువులు, ముస్లింలు
కలిసి అగ్ని గుండం లో నడక వంటి ఆచారాలలో పాల్గొంటారు. అదే సమయంలో, చాలా మంది హిందువులు ఉపవాసాలు పాటిస్తూ, కర్బలా సంఘటనల ఆధారంగా రూపొందించిన తమిళ
గ్రంథమైన షహాదత్నామాను పఠిస్తారు.
కాశ్మీర్:
మోహియల్ బ్రాహ్మణ వర్గానికి చెందిన సభ్యులు, తమ పూర్వీకులు కర్బలా యుద్ధ సమయంలో ఇమామ్ హుస్సేన్కు మద్దతు ఇచ్చారని
నమ్ముతూ, మొహర్రంను
అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తారు.
ఒడిశా:
పెటిపూర్ గ్రామంలో, శ్మశానవాటిక
భూమి విషయంలో హిందువులు, ముస్లింల
మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం, హిందూ నాయకుడు నరేష్ ఆచార్య నేతృత్వంలో ఇరు వర్గాల సభ్యులు కలిసి
నిర్వహించిన మొహర్రం ఊరేగింపుతో ముగిసినట్లు సమాచారం.
పంజాబ్లోని
హుస్సేనీ బ్రాహ్మణులు
ఇమామ్ హుస్సేన్ పట్ల హిందువుల భక్తికి బహుశా
అత్యంత ఆకర్షణీయమైన ఉదాహరణ పంజాబ్లోని దత్ బ్రాహ్మణులుగా కూడా పిలువబడే హుస్సేనీ
బ్రాహ్మణులలో కనిపిస్తుంది. సామాజిక సంప్రదాయాల ప్రకారం, దత్ బ్రాహ్మణుల పూర్వీకుడైన రాహబ్ పంజాబ్ నుండి అరేబియాకు ప్రయాణించి, కర్బలాలో యజీద్కు వ్యతిరేకంగా ఇమామ్ హుస్సేన్తో కలిసి పోరాడాడు. రాహబ్ విధేయతకు
గుర్తింపుగా, ఇమామ్ హుస్సేన్ రాహబ్ కు "సుల్తాన్" అనే బిరుదును ప్రదానం
చేశారని చెబుతారు.
ఇమామ్
హుస్సేన్ అమరత్వం ప్రాచీన హిందూ గ్రంథాలలో ముందే చెప్పబడిందని హుస్సేనీ
బ్రాహ్మణులు నమ్ముతారు మరియు ఇమామ్ అలీని "ఓం మూర్తి" అనే గౌరవ బిరుదుతో
పిలుస్తారు.
ఇమామ్
హుస్సేన్ భార్య అయిన షహర్ బాను సోదరి చంద్రగుప్త అనే భారతీయ పాలకుడిని వివాహం
చేసుకుందని మరో ప్రసిద్ధ సంప్రదాయం చెబుతుంది. ఇమామ్ హుస్సేన్ను
ముట్టడించినప్పుడు, ఆయనకు సహాయం
చేయడానికి ఒక భారతీయ సైన్యాన్ని పంపారని, కానీ వారు ఆయన
అమరత్వం పొందిన తర్వాతే అక్కడికి చేరుకున్నారని అంటారు. భారతీయ మద్దతుదారుల ఉనికి
కారణంగా కూఫాలోని కొంత భాగం దేర్-ఎ-హిందీయా (భారతీయ ప్రాంతం)గా ప్రసిద్ధి
చెందిందని సామాజిక కథనాలు కూడా చెబుతున్నాయి.
దక్షిణ
భారతదేశంలో, మొహర్రం ఉత్సవాల కేంద్రాలను
అషూరా ఖానాలు అని పిలుస్తారు. దక్కన్కు చెందిన ఆదిల్ షాహీ మరియు కుతుబ్ షాహీ
రాజవంశాలు వాటి అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.వీటిలో అత్యంత ముఖ్యమైనది
హైదరాబాద్లోని బాద్షాహీ అషూరా ఖానా. ఇది 1592లో నిర్మించబడింది మరియు దాని
అద్భుతమైన ఇరానియన్ టైల్ పనికి ప్రసిద్ధి చెందింది. లక్నోలోని బారా ఇమాంబారా,
చోటా ఇమాంబారా మరియు షా నజఫ్ ఇమాంబారాలు వాటి వాస్తు వైభవానికి
మరియు అలంకరించబడిన యూరోపియన్ షాండిలియర్లకు సమానంగా ప్రసిద్ధి చెందాయి.
మొహర్రం
సందర్భంగా వినిపించే ఉర్దూ శోకగీతాలు (మర్సియాలు) మరియు విలాపాలు ఉర్దూ సాహిత్య
అభివృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి.అనేక హిందూ కవులు ఇమామ్ హుస్సేన్ గౌరవార్థం
ప్రసిద్ధ మర్సియాలు మరియు శోకగీతాలను రచించారు,
గ్రామీణ
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, మొహర్రం వేడుకలు సమాజాల మధ్య సామాజిక ఐక్యత, భావోద్వేగ
మద్దతు మరియు భాగస్వామ్య గుర్తింపు భావనను అందిస్తూనే ఉన్నాయి.
భారతదేశంలో
మొహర్రం వేడుకలు ఇమామ్ హుస్సేన్ వారసత్వం స్మరణ, త్యాగం, న్యాయం మరియు మత సామరస్యం యొక్క సంస్కృతిని
ప్రదర్శిస్తాయి.
No comments:
Post a Comment