23 March 2020

మౌలానా ఉబైదుల్లా సింధి (1872-1944) Maulana Ubaidullah Sindhi(1872-1944)


ప్రముఖ భారత స్వాతంత్ర సమర యోధుడు:
 Image result for Maulana Ubaidullah Sindhi(1872-1944)





మౌలానా ఉబైదుల్లా సింధి గా పిలువబడే బుటా సింగ్ ఉప్పల్ (1872-1944) భారత స్వాతంత్ర్య ఉద్యమ శక్తివంతమైన నాయకులలో ఒకరు. మౌలానా ఉబైదుల్లా సింధి వృత్తి రీత్యా రాజకీయ కార్యకర్త, ఇస్లామిక్ తత్వవేత్త  మరియు పండితుడు.

మౌలానా ఉబైదుల్లా సింధీ బ్రిటిష్ వారినుండి భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం మరియు భారతదేశంలో దోపిడీ లేని సమాజం కోసం కష్టపడ్డారు. అతను 1915 లో ఆఫ్ఘనిస్తాన్లో స్థాపించబడిన భారత మొదటి తాత్కాలిక ప్రభుత్వo (Provisional Government of India) లో  హోంమంత్రి.


ఉబైదుల్లా 1872 మార్చి 10 న పంజాబ్‌లోని సియాల్‌కోట్ జిల్లాలోని ఉప్పల్ ఖాత్రి కుటుంబంలో బుటా సింగ్ ఉప్పల్‌గా జన్మించాడు. ఉబైదుల్లా పుట్టడానికి నాలుగు నెలల ముందే అతని తండ్రి మరణించాడు మరియు పిల్లవాడిని తాత రెండు సంవత్సరాలు పెంచాడు. తాత మరణం తరువాతబుటా సింగ్ తన  మేన మామ సంరక్షణలో పెరిగాడు.

బుటా సింగ్ ఉప్పల్ 15 ఏళ్ళ వయసులో ఇస్లాం మతంలోకి మారి "ఉబైదుల్లా సింధి" గా మారాడు. తరువాత విద్య కోసం  దారుల్ ఉలూమ్ డియోబంద్‌లో చేరాడు, అక్కడ అతను మౌలానా అబూ సిరాజ్, మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి మరియు మౌలానా మహమూద్ అల్ హసన్‌ వంటి ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుల ఆధ్వర్యంలో వివిధ ఇస్లామిక్ విభాగాలను లోతుగా అధ్యయనం చేశారు. మౌలానా నజీర్ హుస్సేన్ డెహల్వి నుండి సాహిహ్ అల్-బుఖారీ మరియు తిర్మిధీలలో పాఠాలు నేర్చుకున్నాడు మరియు మౌలానా అహ్మద్ హసన్ కాన్‌పురి వద్ద  తర్కం మరియు తత్వాన్ని చదివాడు.

1891 లో  ఉబైదుల్లా డియోబంద్ పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1901 లో ఉబైదుల్లా సింధ్ లోని గోత్ పీర్ జాండా గ్రామంలో దారుల్ ఇర్షాద్ ను స్థాపించారు.అక్కడ అతను దాదాపు ఏడు సంవత్సరాలు తన పాఠశాలలో పనిచేశాడు.

మౌలానా సింధీ ఉబైదుల్లా 1909లో మహమూద్ అల్ హసన్ కోరిక మేరకు, డియోబంద్ పాఠశాలకు తిరిగి వచ్చాడు. విద్యార్థి సంఘం జామితుల్ అన్సార్” కోసం చాలా కృషి చేసాడు. ఉబైదుల్లా రహస్య బ్రిటీష్ వ్యతిరేక ప్రచార కార్యకలాపాల్లో చాలా చురుకుగా పాల్గొన్నాడు. తరువాత ఉబైదుల్లా మహమూద్ అల్ హసన్ కోరిక మేరకు డిల్లి లో తన పనిని ప్రారంభించారు. డిల్లి లో  అయన హకీమ్ అజ్మల్ ఖాన్ మరియు డాక్టర్ అన్సారీలతో కలిసి పనిచేశాడు. 1912 లో అతను నజ్జారతుల్ మరీఫ్ అనే మదర్సాను స్థాపించాడు.ఇది ప్రజలలో ఇస్లాంను ప్రచారం చేయడంలో మరియు వ్యాప్తి చేయడంలో విజయవంతమైంది.


1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో, ప్రపంచంలోని ఇతర సానుభూతి దేశాల సహాయంతో మహమూద్ అల్ హసన్ నేతృత్వంలో బ్రిటిష్ ఇండియాలోని నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ యొక్క గిరిజన బెల్ట్‌ లో తిరుగుబాటు ప్రణాళికలు రూపొందించబడ్డాయి.

ప్రాథమిక ప్రణాళికల ప్రకారం  మౌలానా హసన్ జనరల్-ఇన్-చీఫ్ గా మదీనా ప్రధాన కార్యాలయం కలిగిన ఇస్లామిక్ సైన్యాన్ని (హిజ్బ్ అల్లాహ్) ను ఏర్పరచడం మరియు  కాబూల్ వద్ద దాని  భారతీయ దళం ను ఏర్పరచడo. ఉబైదుల్లా విద్యార్థులు కొందరు ముందుగా కాబూల్ వెళ్ళారు. బ్రిటిష్ ఇండియాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాలని ఉబైదుల్లా ఆఫ్ఘన్ ఎమిర్‌కు ప్రతిపాదించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా 1916 లో అరెస్టుకు ముందు ఈ ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

బ్రిటీష్ ఇండియాలోని గిరిజన బెల్టులో ముస్లిం తిరుగుబాటును ప్రారంభించాలనే ప్రణాళికతో మౌలానా ఉబైదుల్లా సింధి మరియు మౌలానా మహమూద్ అల్ హసన్ 1915 అక్టోబర్‌లో కాబూల్‌కు వెళ్లారు., ఉబైద్ అల్లాహ్ ఆఫ్ఘనిస్తాన్ అమీర్ ని  బ్రిటన్ పై  యుద్ధం ప్రకటించమని కోరగా  మహమూద్ అల్ హసన్ జర్మన్ మరియు టర్కిష్ దేశాల సహాయం కోరాడు.

హిజాజ్ టర్కీ గవర్నర్ గలీబ్ పాషా సహాయం కోసం మహమూద్ అల్ హసన్ భారతదేశం విడిచి వెళ్ళగా, హసన్ ఆదేశాల మేరకు ఉబైదుల్లా ఎమిర్ హబీబుల్లా మద్దతు కోరడానికి కాబూల్‌కు వెళ్లారు. హసన్ హిజాజ్ వైపు వెళ్ళాడు. ఉబైదుల్లా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఎమిర్ హబీబుల్లాతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకోగలిగాడు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఉబైదుల్లా కాబూల్‌  చేరుకొని ఆఫ్ఘన్ అమీర్ హబీబుల్లా ఖాన్‌ను సహాయం కోరినాడు.  అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత, జర్మన్ మద్దతుతో బ్రిటిష్ ఇండియాలో విప్లవం కోసం రాజా మహేంద్ర ప్రతాప్ చేసిన ప్రణాళికలకు తన మద్దతును అందించారు.

1915 చివరలో, బెర్లిన్లోని భారత స్వాతంత్ర్య కమిటీ మరియు జర్మన్ యుద్ధ మంత్రిత్వ శాఖ పంపిన 'నీడర్‌మేయర్-హెంటిగ్ యాత్ర' సింధీని కాబూల్‌లో కలిశారు. దానికి బహిష్కరించబడిన భారత యువరాజు రాజా మహేంద్ర ప్రతాప్ నేతృత్వం వహించగా దాని సభ్యులలో ఇస్లామిక్ పండితుడు అబ్దుల్ హఫీజ్ మొహమ్మద్ బరకతుల్లా మరియు జర్మన్ అధికారులు వెర్నర్ ఒట్టో వాన్ హెంటిగ్ మరియు ఓస్కర్ నీడర్‌మేయర్ అనేక ఇతర ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఈ యాత్ర ఎమిర్ హబీబుల్లా ద్వారా బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది బ్రిటిష్ ఇండియాలో తిరుగుబాటును ప్రారంభిస్తుందని భావించారు.

1 డిసెంబర్ 1915, భారత, జర్మన్ మరియు టర్కీ సభ్యుల సమక్షంలో ఎమిర్ హబీబుల్లా యొక్క 'బాగ్-ఎ-బాబర్ ప్యాలెస్' వద్ద భారత తాత్కాలిక ప్రభుత్వం స్థాపించబడింది. ఇండియా పై బ్రిటిష్ అధికారాన్ని కోల్పోయినప్పుడు  ఇది స్వతంత్ర భారతదేశం యొక్క బాధ్యతను స్వీకరించే ' బహిష్కత  విప్లవాత్మక ప్రభుత్వం('revolutionary government-in-exile') గా ప్రకటించబడింది. మహేంద్ర ప్రతాప్‌ను దాని అధ్యక్షుడు, బర్కతుల్లా ప్రధానమంత్రి, హోం  మంత్రి ఉబైదుల్లా సింధీ, మౌలవి బషీర్, డిఫెన్స్  మంత్రి, మరియు చంపకరన్ పిళ్ళై విదేశాంగ మంత్రిగా ప్రకటింపబడినారు.

 తాత్కాలిక భారత ప్రభుత్వం హిజాజ్ టర్కీ గవర్నర్ గాలిబ్ పాషా, రష్యన్ సామ్రాజ్యం, రిపబ్లికన్ అఫ్ చైనా మరియు జపాన్ నుండి గుర్తింపు పొందారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం తరువాత సోవియట్ నాయకత్వం నుండి మద్దతు పొందటానికి ప్రయత్నించినది.. 1917 లో రష్యాలో ఫిబ్రవరి విప్లవం తరువాత, ప్రతాప్ ప్రభుత్వం కొత్త సోవియట్ ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుంది. 1918 లో, మహేంద్ర ప్రతాప్ బెర్లిన్‌లో కైజర్‌ను కలవడానికి ముందు ట్రోత్స్కీనిTrotsky పెట్రోగ్రాడ్‌లో కలుసుకున్నాడు, బ్రిటిష్ ఇండియాకు వ్యతిరేకంగా సమీకరించాలని ఇద్దరినీ కోరారు.

ఏది ఏమయినప్పటికీ, ఈ ప్రణాళికలు విఫలమయ్యాయి, ఎమిర్ హబీబుల్లా తటస్థంగా ఉండినాడు. 1917 లో జర్మన్లు ​​తమ మద్దతును ఉపసంహరించుకున్నారు, కాని 'భారత తాత్కాలిక ప్రభుత్వం' కాబూల్ లో  ఉంది. 1919 లో, ఈ ప్రభుత్వం చివరికి ఆఫ్ఘనిస్తాన్ పై బ్రిటిష్ దౌత్య ఒత్తిడితో  రద్దు చేయబడింది.

ఉబైదుల్లా దాదాపు ఏడు సంవత్సరాలు కాబూల్‌లో ఉన్నారు. మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో హబీబుల్లా హత్య తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేపట్టిన యువ రాజు అమానుల్లా ఖాన్‌ను కూడా ఆయన ప్రోత్సహించారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఆఫ్గన్ రాజు అమనుల్లా బ్రిటన్ ఒత్తిడిలోకి వచ్చాడు.దీనితో  ఉబైదుల్లా సింధి ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరవలసి వచ్చింది

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు ఉబైదుల్లా సింధి ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఉన్నాడు, ఉబైదుల్లా తరువాత ఆఫ్ఘనిస్తాన్ నుండి రష్యాకు వెళ్లారు, అక్కడ అతను సోవియట్ నాయకత్వ ఆహ్వానం మేరకు ఏడు నెలలు గడిపాడు మరియు అధికారికంగా రాజ్య అతిథిగా పరిగణించబడ్డాడు. ఈ కాలంలో, అతను సోషలిజం యొక్క భావజాలాన్ని అధ్యయనం చేశాడు. అయితే, రష్యాలో, ఆ సమయంలో తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న లెనిన్‌ను కలవలేకపోయాడు.

1923 లో ఉబైదుల్లా రష్యా నుండి టర్కీకి బయలుదేరాడు. టర్కీలో రెండు సంవత్సరాలు ఉన్నాడు.  అక్కడ అతను 1924 లో 'షా వలీల్లా ఉద్యమం' యొక్క మూడవ దశను ప్రారంభించాడు. అతను ఇస్తాంబుల్ నుండి 'భారత స్వాతంత్ర్యానికి చార్టర్' జారీ చేశాడు.



ఉబైదుల్లా 1927 లో అరేబియాలోని మక్కాకు బయలుదేరి అనేక దేశాల గుండా వెళుతూ చివరికి 1929 లో హిజాజ్ (సౌదీ అరేబియా) కు చేరుకున్నాడు, అక్కడ అతను ఇస్లాం తత్వశాస్త్రం అధ్యయనం చేస్తూ 14 సంవత్సరాలు గడిపాడు.

1936 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆయనను భారతదేశానికి తిరిగి రావాలని అభ్యర్థించింది. బ్రిటిష్ రాజ్ కూడా దానికి  అనుమతి ఇచ్చింది. అతను 1938 లో సౌదీ అరేబియా నుండి కరాచీ ఓడరేవులో అడుగుపెట్టాడు. తరువాత అతను దిల్లికి వెళ్ళాడు, అక్కడ అతను షా వలీల్లా యొక్క హుజ్జతుల్లాహిల్ బలిఘా Hujjatullahil Baalighah  పుస్తకాన్ని మౌలానా సయీద్ అహ్మద్ అక్బరాబాదికి బోధించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. భారతదేశ విభజనను వ్యతిరేకిస్తూ, ఉబైదుల్లా జూన్ 1941 లో కుంబకోణం వద్ద ఐక్య భారతదేశానికి మద్దతు ఇచ్చే సమావేశానికి నాయకత్వం వహించారు.

1944 లో తన కుమార్తెను చూడటానికి ఉబైదుల్లా సింది  రహీమ్ యార్ ఖాన్ బయలుదేరాడు. రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని ఖాన్పూర్ పట్టణానికి సమీపంలో ఉన్న 'దీన్ పూర్' గ్రామంలో అతను తీవ్ర అనారోగ్యానికి గురై 1944 ఆగస్టు 21 72 సంవత్సరాల వయస్సు లో మరణించారు. అతని గురువుల సమాధి కల శ్మశానంలో అతనిని ఖననం చేశారు.

మౌలానా ఉబైదుల్లా సింధి సాహిత్య రచనలు:
అతని ప్రసిద్ధ పుస్తకాలలో

·         సఫరనామా -ఐ-కాబూల్ Safarnama-i-Kabul 
·         షా వలీల్లా ర్ ఉంకా ఫల్సాఫా Shah Waliullah aur Unka Falsafa 
·         షూర్-ఒ-అగహి Shaoor-o-Agahi
·         ఖురానీ షౌర్-ఎ-ఇంక్లాబ్ Qurani Shaoor-e-Inqalab
·         ఖుత్బాట్-ఒ-మకాలత్ Khutbat-o-Makalat.
·         జాతి డైరీ (ఒక ఆత్మకథ) Zaati Diary (an autobiography)


ఖ్యాతి/లెగసె
·        మౌలానా ఉబైదుల్లా సింధి భారతదేశంలోని న్యూ డిల్లి లోని  జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం  యొక్క జీవిత సభ్యుడు.
·        అతను జామియా మిలియా ఇస్లామియాకు చాలా కాలం సేవలందించాడు. జామియా మిలియా ఇస్లామియాలోని హాల్ ఆఫ్ బాయ్స్ /బాలుర హాస్టల్ కు అతని పేరు పెట్టబడింది.
·        పాకిస్తాన్ కాలమిస్ట్ ఫర్మాన్ నవాజ్ అతని అమూల్యమైన ఉర్దూ వ్యాసాలను ఆంగ్లంలోకి అనువదించినాడు.


భారత స్వాతంత్ర్య ఉద్యమo లో పాల్గొన్న  ఇస్లామిక్ స్కూల్ అఫ్ దేయోబంద్  యొక్క అత్యంత చురుకైన మరియు ప్రముఖ సభ్యులలో ఉబైదుల్లా ఒకరు. ఉబైదుల్లా సింధి భారతదేశం యొక్క గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. అతని జీవితకాల ప్రవర్తన మరియు పోరాటo నుండి భారతదేశాన్ని భారతీయులు పరిపాలించాలని ఆయన కోరుకున్నారు అన్నది  స్పష్టమవుతుంది.









No comments:

Post a Comment