6 March 2024

ఇస్లాం మరియు సామాజిక సంస్కరణలు ISLAM AND SOCIAL REFORMS

 


సాధారణంగా సాంప్రదాయ ఉలమాలు ఎల్లప్పుడూ ఇస్లాంకు విరుద్ధం అని తాము భావించే సామాజిక సంస్కరణలను వ్యతిరేకిస్తారు మరియు దివ్య ఖురాన్ ఆయతులను ఉటంకిస్తూ ముస్లిం సమాజం నుండి మద్దతును పొందుతారు లేదా మద్దతును సమీకరిస్తారు. .

ఉలమాలు తరచూ సంస్కర్తలను  కాఫిర్ లేదా ముల్హిద్ అని ప్రకటిస్తారు. ఒకసారి ఫత్వా జారీ చేయబడిన తర్వాత, సంస్కర్త సమాజం నుండి పూర్తిగా ఒంటరిగా ఉంటాడు మరియు సంస్కరణ ఉద్యమాన్ని కొనసాగించడం చాలా కష్టం అవుతుంది.  చాలా మంది సంస్కర్తలు చరిత్రలో ఈలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, కాని 19వ శతాబ్దం నుండి పాశ్చాత్య 'అభివృద్ధి చెందిన సమాజం' ప్రభావంతో ఇస్లామిక్ ప్రపంచంలో అనేక సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.

ఇక్కడ సామాజిక సంస్కరణ అంటే ఏమిటో స్పష్టం చేయడం ముఖ్యం? సంస్కరణలు, అంటే దైవిక చట్టాన్ని మార్చడం గురించి కాదు, గతంలో ఉన్న సామాజిక పరిస్థితులలో రూపొందించబడిన కొన్ని నియమాలను సంస్కరించడం మరియు కొత్త మానవ మార్గాల్లో దైవాన్ని అర్థం చేసుకోవడానికి లేదా చేరుకోవడానికి ప్రయత్నించడం.

'రీ-ఫార్మ్' అనే పదం సమకాలీన సవాళ్లను ఎదుర్కోవటానికి సూత్రాలను తిరిగి రూపొందించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఉదాహరణకు, స్త్రీలకు సంబంధించిన కొన్ని ఖురాన్ ఆయతులను అప్పటి ఉలమాలు ఒక నిర్దిష్ట మార్గంలో అర్థం చేసుకున్నారు మరియు ఆ అవగాహన ఆధారంగా షరియా నియమాలు రూపొందించబడ్డాయి. నేడు ఒక సంఘ సంస్కర్త ఆ ఆయతులను తనదైన రీతిలో అర్థం చేసుకుని, కొన్ని నియమాలను సంస్కరిస్తే, అతను ఖురాన్‌కు భిన్నంగా లేదా పూర్తిగా కొత్తదాన్ని ప్రారంభిస్తున్నాడని అర్థం కాదు.

గొప్ప అలీమ్ మౌలవి ముంతాజ్ అలీ ఖాన్, దేవ్‌బంద్‌ మహిళల హక్కుల పై హుక్క్ అల్-నిస్వాన్ అనే పుస్తకాన్ని వ్రాసాడు మరియు స్త్రీల హక్కులు, స్థానం పై  దివ్య ఖురాన్ నుండి అనేక ఆయతులను ఉదాహరించాడు మరియు 19వ శతాబ్దంలో మారే పరిస్థితులకు అనుగుణంగా దివ్య ఖురాన్ వాక్యాలను తనదైన రీతిలో అర్థం చేసుకున్నాడు.

మనం అతన్ని కాఫిర్ అంటామా? లేక కేవలం సంస్కర్తా? సర్ సయ్యద్ ఉద్యమానికి మౌలవీ ముంతాజ్ అలీ మద్దతుదారు. ముంతాజ్ అలీ ఆలోచన మరియు అవగాహన చాలా ఆధునికమైనది అది దివ్య ఖురాన్ పరిధిలో ఖచ్చితంగా ఉంది. మౌలవీ ముంతాజ్ అలీ హుక్క్ అల్-నిస్వాన్ పుస్తకాన్ని ప్రచురించాడు.  

సర్ సయ్యద్ గొప్ప సంఘ సంస్కర్త. ఉలమా ఖురాన్‌పై సర్ సయ్యద్ వ్రాసిన తఫ్సీర్ (వ్యాఖ్యానం)ను వ్యతిరేకించడంతో పాటు ఆధునిక కళాశాల స్థాపనకు సర్ సయ్యద్ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆధునిక విద్య కోసం సర్ సయ్యద్ ఉద్యమాన్ని ఉలమా వ్యతిరేకించారు మరియు సర్ సయ్యద్ పై ఫత్వాలు జారీ చేశారు. సర్ సయ్యద్ ను 'కాఫిర్', 'క్రిస్టియన్' మరియు 'యాహుది' అని పిలిచారు. ఉలమాలలో  ఒకరు మక్కాకు కూడా వెళ్లి సర్ సయ్యద్ హత్య కోసం ఫత్వా కూడా పొందారు.

అన్నింటికంటే, భారతదేశంలోని ముస్లిం కమ్యూనిటీ లో సామాజిక సంస్కరణలకు ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది.. సామాజిక సంస్కరణలకు వ్యతిరేకత అనేక సంక్లిష్ట కారకాల నుండి ఉద్భవిస్తుంది. దురదృష్టవశాత్తూ, ఇస్లాం కు వ్యతిరేకంగా ఉన్న మూఢ నమ్మకాలు కూడా ఇస్లాం మతంలో భాగమయ్యాయి మరియు ఈ నమ్మకాలకు వ్యతిరేకత కూడా ఇస్లాం మతంపై దాడికి సమానం.

సర్ సయ్యద్ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గొప్ప మద్దతుదారుడు మరియు సామాజిక ప్రశ్నలకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉన్నాడు, ఇది మత విశ్వాసాలకు ఆటంకం అని భావించి  ఉలమా సర్ సయ్యద్ పై దాడి చేశారు. సర్ సయ్యద్ సైన్స్ ను సమర్థించినందున దేవుణ్ణి విశ్వసించనట్లుగా సర్ సయ్యద్ ను 'నీచరి' (అనగా ప్రకృతిని విశ్వసించేవాడు) అని పిలిచేవారు.. 'దేవుని వాక్యం దేవుని పనికి విరుద్ధం కాదు' అనేది సర్ సయ్యద్ ప్రసిద్ధ సూచన. దివ్య ఖురాన్ దేవుని వాక్యం మరియు సర్ సయ్యద్ సైన్స్ ద్వారా దేవుని పనిని క్రమబద్ధమైన అధ్యయనానికి మద్దతు ఇచ్చారు.

ఒక నిజమైన మతపరమైన వ్యక్తి ఎల్లప్పుడూ కారణం మరియు తీవ్రమైన ఆలోచనలకు విజ్ఞప్తి చేస్తాడు. ఖురాన్ విశ్వాసులను మరియు అవిశ్వాసులను కూడా ఆలోచించడానికి మరియు ప్రతిబింబించడానికి పదేపదే ఆహ్వానిస్తుంది (6:50, 7:184).

ఉలమా తమ సొంత స్థానాలను కాపాడుకోవడానికి మొదట్లో ఏదైనా మార్పును వ్యతిరేకించడం ప్రారంభిస్తారు. మరియు వ్యతిరేకతను చట్టబద్ధం చేయడానికి మతపరమైన కారణాలను కనుగొంటారు మరియు ప్రజలను ఆకట్టుకోవడానికి మత గ్రంధాల నుండి కోట్ చేయడానికి ప్రయత్నిస్తారు.

19వ శతాబ్దపు ఉలమాలు ఆంగ్ల విద్య పట్ల తీవ్ర భయాందోళనలు కలిగి ఉన్నారు. అరబిక్ విద్యను ఇస్లాం వైపు ఒక అడుగుగా పరిగణించినట్లే, ఇంగ్లీషు విద్య క్రైస్తవం వైపు ఒక అడుగుగా పరిగణించబడింది.

 ఉలమా ఆధునిక విద్యను వ్యతిరేకించడానికి మరో కారణం కూడా ఉంది. ఉలమాలు మొఘల్ కోర్టులలో ఉన్నత పదవులను కలిగి ఉన్నారు మరియు ఖాదీలు లేదా మతపరమైన న్యాయమూర్తులుగా పనిచేశారు. ఈ ఖాదీల స్థానంలో బ్రిటీష్ న్యాయమూర్తులు మరియు న్యాయశాస్త్రం చదివిన అధిక అర్హత కలిగిన భారతీయులు నియమితులయ్యారు. ఇవి ఉలమాలలో తీవ్ర ఆగ్రహాన్ని సృష్టించాయి మరియు వారు తమ నుండి అన్నింటికీ దూరం చేస్తున్న ఆంగ్ల విద్యను ఖండించారు. ఆధునిక విద్యాసంస్థలు మదర్సాలను కూడా తొలగిస్తాయని మరియు మదర్సా ఉపాధ్యాయులుగా తమ ఉద్యోగాలను కూడా కోల్పోతారని వారు భయపడ్డారు.

భారతదేశంలోని ముస్లింలలో సర్ సయ్యద్ ఆధునిక విద్య కోసం తీవ్రమైన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆంగ్ల విద్య యొక్క లబ్ధిదారులైన ముస్లింల యొక్క కొత్త తరగతి నెమ్మదిగా ఉద్భవించింది మరియు ఆ తరగతి తదనంతరం మార్పుకు నాందిగా మారింది.

ప్రజలలో నేటికీ గౌరవించబడే మేధావుల గెలాక్సీ ఏర్పడింది. వారిలో నవాబ్ ముహ్సినుల్ ముల్క్, మౌలవీ చిరాగ్ అలీ, జస్టిస్ అమీర్ అలీ, మౌలవీ ముంతాజ్ అలీ ఖాన్ మరియు పలువురు ఉన్నారు. వారు కొత్త జీవిత దృక్పథాన్ని అభివృద్ధి చేశారు మరియు ముస్లింలకు మెరుగైన జీవితానికి పునాది వేశారు. ఈ కొత్త తరగతి ముస్లింలలో చాలామంది సివిల్, పోలీస్ మరియు ఇతర సర్వీసుల్లో చేరి తమకంటూ పేరు తెచ్చుకున్నారు.

నేడు చాలా మంది ఉలమాలు ఇంగ్లీషు నేర్చుకోడమే కాకుండా ఇంగ్లీషు భాషలో ఇస్లాంను ముస్లిమేతరులకు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లీషు మీడియం ద్వారా విద్యనందించేందుకు మదర్సాను ఏర్పాటు చేస్తున్నారు. కాఫిర్ల భాషగా భావించబడే ఇంగ్లీష్ ముస్లిం ప్రపంచంలో నిలిచిపోయింది. ఆ విధంగా మార్పును వ్యతిరేకించే వారు తదనంతరం దానిని అంగీకరించడమే కాకుండా తమకు దానిని తమ మనుగడ సాధనంగా కూడా మార్చుకొంటారు. . మన ఉలమాలు మొదట్లో కొత్తవాటిని తీవ్రంగా వ్యతిరేకించి చివరకు తమ మనుగడ కోసం దానిని  అంగీకరించడం జరిగింది.

 

మూలం: అస్గర్ అలీ ఇంజనీర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం

అనువాదం: అజ్గర్ అలీ, రిటైర్డ్ లెక్చరర్,  తెనాలి.

No comments:

Post a Comment