18 May 2021

హైదరాబాద్‌ లోని ప్రాంతాలు- వాటికి ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయో తెలుసా.?



హైద్రాబాద్ ను చాలా ఏళ్ల పాటు కుతుబ్ షాహీలు, నిజాం రాజులు ప‌రిపాలించ‌డంతో ఇక్క‌డి ప్రాంతాల‌కు వాళ్ల‌కు సంబంధించిన పేర్లు క‌నిపిస్తుంటాయి.! హైద్రాబాద్ లో మ‌నం పిల్చుకునే ఆ ఏరియాల‌కు….ఆ పేర్లు ఎలా వ‌చ్చాయో దాని చ‌రిత్రేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

1. బేగంపేట్

6వ నిజాం  మహబూబ్  అలీఖాన్ త‌న కుమార్తె బ‌షీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని  కట్నంగా  ఇచ్చాడు . ఆ స్థలానికి  బషీర్ ఉన్నిసా బేగం  పేరు  మీదగా  బేగంపేట  అని  పేరు వచ్చింది.

2. చార్మినార్

కులికుతుబ్ షా  కట్టిన  ఈ కట్టడానికి  ప్రధాన  ఆకర్షణ నాలుగు స్థంబాలు…..ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలువీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది!

3. సికింద్రాబాద్

మూడో  నిజాం  సికిందర్ ఝా  పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్  అనే  పేరు  వచ్చింది . అంతకుముందు  సికింద్రాబాద్ ని  లష్కర్  అని  పిలిచే వారు.

4.ఖైరతాబాద్

ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.

5. శంషాబాద్

షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు. దీని అర్థం ప్ర‌భువుల యందు సూర్యుడిలాంటి వాడని…. ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు క‌ల‌దు.!

6. నాంపల్లి

నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.

7. హిమయత్ నగర్

1933 లో  ఏడవ నిజాం  ఉస్మాన్  అలీఖాన్  యొక్క పెద్ద కుమారుడు   హిమాయత్  అలీ ఖాన్  ఆస‌ఫ్ జా పేరు  మీద  ఆ స్థలానికి  హిమాయత్ నగర్  అని  పేరు వచ్చింది.

8. అబిడ్స్

ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా  యూదువ్యాపారి  ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత  కొంతకాలానికి  ఆల్బర్డ్ అబిడ్  ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది!కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది

9. సోమాజిగూడ

నిజాం కాలంలోని రెవెన్యూ  డిపార్ట్మెంట్  అధికారైన సోనాజీకి  కొన్ని  భూములుండేవి .  సోనాజీ కాస్త సోమాజి  అయింది.  గూడ  అంటే  చిన్న  గూడెం  లేదా ప్రాంతం  అని  అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది!

10 . మాసబ్ ట్యాంక్

6వ కుతుబ్ షాహ్  భార్య  హ‌యత్  భ‌క్షిభేగంను  మాసాహెబా  అని  పిలిచేవారు.  మాసాహెబా పల్లె భూములకు  సాగునీరు  ఇవ్వడానికి   ఒక ట్యాంక్  నిర్మించింది .  ఆ ట్యాంక్  పేరు  మాసాహెబా తలాబ్  అని  పిలిచేవారు . చివరకు  ఆ పేరు మాసబ్ ట్యాంక్  అయింది .

11. హైదరాబాద్

కులీకుతుబ్ షా భార్య  భాగమతి  వివాహం  తర్వాత తన  పేరుని  హైదర్ మహల్ గా  మార్చుకున్నారు . హైదర్ మహల్  అంటే  హైద్రా నగరం  అని  అర్ధం తర్వాత  ఆ పేరు  మీద  హైదరాబాద్ గా  మారింది .

12 .మలక్ పేట్

గోల్కొండ  రాజు అబ్దుల్  కుతుబ్ షా  యొక్క  సేవకుడు మాలిక్ యాకుబ్  పేరు  మీదగా  ఈ ప్రదేశానికి  మలక్ పేట్  అనే  పేరు  వచ్చింది.

13 . బషీర్ బాగ్

బసిరుద్దౌలాకు   హైద్రాబాద్ లో   ఒక ప్యాలెస్  ఉండేది .  ఆ ప్యాలెస్  దగ్గర  పెద్ద గార్డెన్  ఉండేది . బసిరుద్దౌలా  పేరు  మీద  ఆ ప్రదేశానికి  బషీర్ బాగ్  అనే  పేరు  వచ్చింది.  బాగ్ అంటే  గార్డెన్  అని  అర్ధం .

14. ఫలక్ నుమా:

ఫలక్  అంటే  ఆకాశం నామ  అంటే  అద్దం .  ఈ ప్రదేశం  అంతా  కొండలతో  ఎంతో  ఎత్తుగా  ఉండేది . కాబట్టి  ఆకాశానికి  అద్దం  అనే అర్థం  వచ్చేలా  ఫలక్ నామ అని  పేరు  పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!

15 . సరూర్ నగర్

రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.

16.లంగర్ హౌజ్:

గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.

17.చెంచల్‌ గూడ:

 చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.

18.కార్వాన్:

ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు.కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.

19.కవాడిగూడ:

ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.

20.దోమలగూడ:

 దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.

21. బేగం బజారు:

 హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.

22. అఫ్జల్ గంజ్:

 ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది

23.హైదర్ గూడ:

మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

24.తార్నాక:

తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.

25.శాలిబండ:

 శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు..కాలక్రమంలో అది శాలిబండగా మారింది

26.హబ్సిగూడ:

నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు

27.మదీనా:

ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది

28.చిక్కడపల్లి:

చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.

29.నౌబత్ పహాడ్:

నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.

30.బాగ్‌లింగంపల్లి:

గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.

31.అడిక్‌మెట్: అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.

32.మీరాలంమండి:

సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!

౩౩.బార్కాస్:

నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.

34.తాడబండ్:

తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌ బండ్‌గా మారిపోయింది.

35.ఎర్రమంజిల్‌:

ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది.రో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.

36.కాచిగూడ:

కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది

37.లాడ్‌ బజార్:

మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.

38.ముషీరాబాద్:

హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.

39.ఫతే మైదాన్:

ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.

40.పబ్లిక్ గార్డెన్స్:

 పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు: బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్స్ అని పిలుస్తున్నారు.

41.చాదర్ ఘాట్:

 మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.

42.ఆస్మాన్ గఢ్:

 1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది. 

43.ఉమ్దా బజార్:

 నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.

44.గౌలిగూడ:

గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.

45,లల్లాగూడ:

 రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది.

46.సుల్తాన్ బజార్: 1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.

47.రికాబ్ గంజ్: రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.

48.డబిర్ పురా:

నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.

49.అంబర్‌ పేట:

అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.

50.చాంద్రాయణగుట్ట:

చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.

51.చిలకలగూడ: చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!

52.మంగళ్ హాట్:

మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.

53.సైదాబాద్:

1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.

54.టప్పాచబుత్ర: టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.

55.తుకారాం గేట్:

లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.

56,యాఖుత్ పురా:

హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు.

 

  

No comments:

Post a Comment