14 May 2026

హజ్ 2026: యాత్రికుల కోసం ఏఐ ఆధారిత సేవలను సౌదీ అరేబియా ప్రవేశపెట్టింది Hajj 2026: Saudi Arabia deploys AI-powered services for pilgrims

 

 హజ్ 2026లో మాట్లాడే రోబోట్

  

మక్కా

ప్రపంచవ్యాప్తంగా వచ్చే హజ్ యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి సౌదీ అరేబియా అధునాతన ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టింది. తొలిసారిగా, అధికారులు అల్-ఖర్జ్‌లోని “జియాఫ్ అల్-రహ్మాన్ సేవా కేంద్రం”లో మాట్లాడే రోబోట్‌ను ఏర్పాటు చేశారు. ఇది 69 భాషలలో సంభాషించగలదు మరియు యాత్రికుల సాధారణ ప్రశ్నలకు సమాధానమివ్వగలదు.

ఇంజనీర్ ఒసామా అల్-షమీరి అభివృద్ధి చేసిన రోబోట్, యాత్రికులకు వారి మాతృభాషలలో మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. దీనివల్ల అనువాదకుల అవసరం తగ్గి, వివిధ దేశాల నుండి వచ్చే సందర్శకులు ఎదుర్కొనే సంభాషణా అడ్డంకులు సులభతరం అవుతాయి.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది ముస్లింలు హజ్ కోసం సౌదీ అరేబియాకు వస్తారు. వీరిలో ఆఫ్రికా, ఆసియా, యూరప్ మరియు అరబిక్ లేదా ఇంగ్లీష్ మాట్లాడలేని ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు కూడా ఉంటారు. ఈ బహుభాషా రోబోట్ వారి ప్రయాణాన్ని మరింత సులభతరం మరియు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

50,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న జియాఫ్ అల్-రహ్మాన్ సేవా కేంద్రం, 35,000 మంది యాత్రికులకు వసతి కల్పించగలదు. మక్కాకు వెళ్లే ప్రధాన భూమార్గంలో ఉన్న జియాఫ్ అల్-రహ్మాన్ సేవా కేంద్రం, రోడ్డు మార్గంలో వచ్చే యాత్రికులకు ఒక ముఖ్యమైన స్వాగత కేంద్రంగా పనిచేస్తుంది. వారు గ్రాండ్ మసీదుకు వెళ్లే ముందు, జియాఫ్ అల్-రహ్మాన్ సేవా కేంద్రం వారికి మార్గనిర్దేశం, దిశానిర్దేశాలు మరియు అవసరమైన సేవలను అందిస్తుంది.

సౌదీ అరేబియా ప్రజా రవాణా సంస్థ (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ), మదీనాలోని ఖుబా మసీదు ప్రాంగణంలో "రోబోబస్" అనే పేరుతో ఒక ఆటోమేటెడ్ షటిల్ బస్సును ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. డ్రైవర్‌లేని ప్రజా రవాణా సాంకేతికతతో సౌది చేపట్టిన తొలి ప్రయోగాలలో "రోబోబస్" ప్రాజెక్ట్ ఒకటి.

కృత్రిమ మేధస్సు (AI)తో నడిచే ఈ షటిల్, తన పరిసరాలను పర్యవేక్షించడానికి, మార్గాలను గుర్తించడానికి, పాదచారులను పసిగట్టడానికి మరియు మానవ డ్రైవర్ లేకుండా సురక్షితంగా పనిచేయడానికి సెన్సార్లు మరియు హై-రిజల్యూషన్ కెమెరాలను ఉపయోగిస్తుంది.

ప్రస్తుతం, ఈ రోబోబస్ ఖుబా మసీదు ప్రాంగణంలో 700 మీటర్ల ప్రత్యేక మార్గంలో నడుస్తుంది. ఇది పురుష మరియు మహిళా యాత్రికులు ఉపయోగించే ప్రవేశ ద్వారాల దగ్గర ఆగుతుంది. ప్రయోగాత్మక దశలో, ఈ షటిల్ గోల్ఫ్ కార్ట్ లేన్ పక్కన, దానికి కేటాయించిన మార్గంలో మాత్రమే నడుస్తుంది.

 

డాక్టర్ బెనజీర్ తంబోలి -ఒక స్ఫూర్తిదాయకమైన కథ Dr. Benazir Tamboli- an inspirational story

 

భారత రాజ్యాంగం అందరికీ సమానత్వ హక్కుకు హామీ ఇస్తుంది. సమాన అవకాశం, సమాన రక్షణ, మరియు సమాన న్యాయం కల్పిస్తుంది.  మహారాష్ట్ర మహిళ డాక్టర్ బెనజీర్ తంబోలి, ముస్లిం మహిళలతో సహా భారతదేశంలోని అణగారిన వర్గాల కోసం ఈ ప్రాథమిక హక్కులను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే బాధ్యతను స్వీకరించారు.

బెనజీర్ ప్రగతిశీల భావాలున్న కుటుంబంలో పెరిగారు. బెనజీర్ కుటుంబం ముస్లిం సత్యశోధక్ మండల్ వ్యవస్థాపకుడైన హమీద్ దల్వాయి ఆలోచనలచే ప్రభావితమైంది. బెనజీర్ తండ్రి, ఇలాహీ మోమిన్, దల్వాయితో కలిసి పనిచేసేవారు. అటువంటి భావజాల వాతావరణంలో పెరగడం వల్ల, బెనజీర్ చిన్నతనం నుండే సమానత్వం మరియు స్వేచ్ఛ విలువలను తన మనస్సులో, ప్రవర్తనలో అలవర్చుకున్నారు.

బెనజీర్ కల్లోలభరితమైన వివాహ జీవితాన్ని ఎదుర్కొన్నారు. బెనజీర్ తన వైవాహిక జీవితం లో అనేక సమస్యలను ఎదుర్కొని, చివరికి విడాకులు తీసుకోవలసి వచ్చింది.విడాకుల తర్వాత, బెనజీర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి బట్టలు కుట్టడం ప్రారంభించింది. బెనజీర్ ఈ వృత్తిలో ఆర్థికంగా స్వతంత్రురాలిగా మారింది.తరువాత బెనజీర్ లెక్చరర్ పదవికి ఇంటర్వ్యూలకు హాజరై, అక్కడ కూడా విజయం సాధించింది.

ముస్లిం బాలబాలికలు ఉర్దూ మాధ్యమంలో ఎక్కువగా చదువుకుంటారు. బెనజీర్ ఉర్దూ మీడియం   విద్యార్థులలో భాషా నైపుణ్యాలను, ముఖ్యంగా ఆంగ్లాన్ని పెంపొందించడానికి, 'తన్జీమ్-ఎ-వాలెదైన్' అనే సంస్థ ద్వారా ఉర్దూ మాధ్యమ పాఠశాలలను సందర్శించి, విద్యార్థులకు ఆంగ్లం బోధించేందుకు చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో అనేక విజయవంతమైన ప్రయోగాలను అమలు చేశారు. ఈ కార్యక్రమాల  ఆధారంగా బెనజీర్ ఒక సిద్ధాంత వ్యాసాన్ని కూడా సమర్పించారు.

ఒక సామాజిక కార్యకర్తగా బెనజీర్ ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కర నిమిత్తం  ముస్లిం సత్యశోధక్ మండలి కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు.ముస్లిం సత్యశోధక్ మండలి ద్వారా, బెనజీర్ అనేక కార్యక్రమాలను అమలు చేశారు మరియు మహిళల హక్కుల కోసం, ముఖ్యంగా ముస్లిం మహిళల సమాన హక్కుల కోసం నిరంతరం గళం విప్పారు. అలాగే, 'ముస్లిం మహిళా సహాయ కేంద్రం' ద్వారా, విడాకులు తీసుకున్న మరియు బాధితులైన అనేక మంది మహిళలకు విలువైన మద్దతును అందించారు.

బెనజీర్ విడాకులు లేదా కుటుంబ వివాదాలను పరిష్కరించడానికి రాజ్యాంగ మరియు న్యాయ ప్రక్రియలను తప్పనిసరిగా ఉపయోగించాలని ఎల్లప్పుడూ నొక్కి చెబుతారు.బెనజీర్ ప్రస్థానం కేవలం సామాజిక సేవకే పరిమితం కాలేదు; విద్యా మరియు సైద్ధాంతిక రంగాలలో కూడా తనదైన ముద్ర వేశారు. బెనజీర్ విద్యలో పిహెచ్.డి పూర్తి చేసి, వివిధ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో బోధించారు.

ఇది కాకుండా, ఆమె 'మహారాష్ట్ర నాలెడ్జ్ కార్పొరేషన్' (MKCL)లో చాలా కాలం పాటు సీనియర్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు మరియు విద్య, విద్యా నిర్వహణ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు

తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠంలో పనిచేస్తున్నప్పుడు, బెనజీర్ మహిళలపై అఘాయిత్యాల నివారణ సెల్ నోడల్ అధికారిగా తన సామాజిక నిబద్ధతను కొనసాగించారు. బెనజీర్ ధైర్యసాహసాలు మరియు అంకితభావంతో చేసిన సేవకు గుర్తింపుగా, న్యూఢిల్లీలో 'సహాస్ సమ్మాన్' (2015) మరియు పూణేలో 'సేవావతి మహిళా పురస్కార్' (2017) వంటి అవార్డులతో బెనజీర్ ను సత్కరించారు.

బెనజీర్ విద్యా సంబంధిత కృషితో పాటు, మరాఠీ, హిందీ మరియు ఆంగ్ల భాషలలో, చాలా అనువాద మరియు ఎడిటింగ్ పనులు చేశారు. బెనజీర్ 'ముస్లిం సత్యశోధక్ పత్రిక' మరియు 'సమాజ్‌వాది అధ్యాపక్ పత్రిక'లకు సహ సంపాదకురాలిగా పనిచేశారు.

బెనజీర్  మండల్ పత్రికకు క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తూ, వివిధ ప్రదేశాలలో పాండిత్య ఉపన్యాసాలు ఇచ్చారు. బెనజీర్ రచించిన 'శిక్షణశాస్త్ర శబ్దకోష్' (విద్యా నిఘంటువు) ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్.

బెనజీర్ 'ప్రభావశాలి శిక్షణ తాజ్న' (ప్రభావవంతమైన విద్యావేత్తలు) అనే గ్రంథాన్ని కూడా రచించారు, మరియు (దక్షిణాన 'స్కై బాబా'గా ప్రసిద్ధి చెందిన) షేక్ యూసుఫ్ బాబా యొక్క తెలుగు కథా సంకలనాన్ని మరాఠీలోకి అనువదించారు,.

బెనజీర్ మరియు ఆమె భర్త, డాక్టర్ షమ్సుద్దీన్ తంబోలి, మరణానంతరం తమ శరీరాలను దానం చేయాలని నిర్ణయించుకుని, అందుకు సంబంధించిన అధికారిక పత్రాలను పూరించారు. ఈ నిర్ణయం వారి ప్రగతిశీల ఆలోచనలలోని పరిపక్వతను తెలియజేస్తుంది.

డాక్టర్ బెనజీర్ తంబోలి ఎంతో మంది ముస్లిం మహిళలు మత మరియు సామాజిక రంగాలకు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ, వారు సైన్స్, వైద్యం, న్యాయవ్యవస్థ, పరిశ్రమ మరియు సాహిత్యంలో కూడా కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు.

డాక్టర్ బెనజీర్ తంబోలి అటువంటి మహిళల గురించి సమాచారాన్ని సేకరించి, ఆ సమాచారాన్ని ఒక పుస్తకంలో నమోదు చేయాలని యోచిస్తున్నారు. బెనజీర్ ముస్లిం సత్యశోధక్ మండలి మరియు హమీద్ దల్వాయిల ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలని విశ్వసిస్తున్నారు.

1954 'ప్రత్యేక వివాహ చట్టం' కింద జంటలు వివాహం చేసుకునేలా ప్రోత్సహించడానికి మరియు వారికి చట్టపరమైన, భావోద్వేగ మద్దతును అందించడానికి బెనజీర్ పనిచేయాలని సంకల్పించారు. సమాజంలో పెరుగుతున్న ద్వేషాన్ని తగ్గించడం మరియు 'ఐక్యత, సమగ్రత'ను ప్రోత్సహించడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నారు.ఈ కార్యక్రమాలలో తన భర్త డాక్టర్ షమ్సుద్దీన్ తంబోలి యొక్క అమూల్యమైన మద్దతు తనకు ఉందని బెనజీర్ పేర్కొన్నారు.

బెనజీర్ కృషి, ఆలోచనలు మరియు సంకల్పం సమాజంలోని ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ముస్లిం మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకం.

మానవత్వాన్ని పునరుజ్జీవింపజేయడానికి" క్రైస్తవ-ముస్లిం ఐక్యతకు పోప్ లియో పిలుపునిచ్చారు Pope Leo Calls for Christian-Muslim Unity to “Revive Humanity”

 

Pope Leo Calls for Christian-Muslim Unity to “Revive Humanity Where It Has Grown Cold”

 

మతాల మధ్య సహకారానికి విజ్ఞప్తి చేస్తూ, " మానవత్వాన్ని పునరుజ్జీవింపజేయడానికి" మరియు సంఘీభావాన్ని పెంచడానికి క్రైస్తవులు, ముస్లింలు కలిసి పనిచేయాలని పోప్ లియో కోరారు.

జోర్డాన్‌కు చెందిన రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్-ఫెయిత్ స్టడీస్ మరియు హోలీ సీ యొక్క డికాస్టరీ ఫర్ ఇంటర్-రిలిజియస్ డైలాగ్ సంయుక్తంగా నిర్వహించిన మతాల మధ్య సదస్సులో పాల్గొన్నవారితో జరిగిన సమావేశంలో పోప్ లియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం "ఆధునిక కాలంలో మానవ కరుణ మరియు సానుభూతి" అనే అంశంపై దృష్టి సారించింది.

"రెండు మతాలకూ కరుణే కేంద్రం," అని పోప్ అన్నారు. కరుణ అనేది క్రైస్తవ మరియు ఇస్లాం మతాలు పంచుకునే ఒక ప్రధాన విలువ అని పోప్ లియో నొక్కి చెప్పారు.

"ముస్లిం సంప్రదాయంలో, కరుణ అనేది విశ్వాసుల హృదయాలలో ఉంచబడిన ఒక దైవిక వరం, మరియు 'అల్-రౌఫ్' అనే పేరు కరుణ దేవుని నుండి ఉద్భవించిందని మనకు గుర్తు చేస్తుంది," అని ఆయన అన్నారు. క్రైస్తవ మతంలో, మానవ బాధలను పంచుకోవడం ద్వారా "కరుణకు సజీవ స్వరూపం"గా నిలిచే యేసుక్రీస్తు ద్వారా కరుణ వ్యక్తమవుతుందని ఆయన అన్నారు.

పేదలు, బలహీనుల పట్ల శ్రద్ధ వహించాల్సిన నైతిక బాధ్యత విశ్వాసులకే ఉందని పోప్ నొక్కి చెప్పారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో జోర్డాన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యేకంగా ప్రశంసించారు, దానిని మానవాళికి ఒక "ఉదారమైన సహకారం" అని అభివర్ణించారు.

"పేదల పట్ల ప్రేమ, వారి బాధలలో పాలుపంచుకోవడం క్రైస్తవులకు ఐచ్ఛికం కాదు," అని పోప్ అన్నారు,

ఆధునిక సాంకేతికత మానవ సానుభూతిని ఎలా ప్రభావితం చేస్తోందనే దానిపై కూడా పోప్ లియో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో చాలా మంది ఇతరుల బాధలు “నాకు సంబంధం లేదు” లేదా “అది నా బాధ్యత కాదు” అని భావిస్తున్నారని, ఇది ఒక ప్రమాదకరమైన మనస్తత్వమని పోప్ అన్నారు.

ప్రపంచవ్యాప్త బాధలను పరిష్కరించడంలో క్రైస్తవులు, ముస్లింలు చేతులు కలపాలని పోప్ లియో పిలుపునిచ్చారు. రెండు మతాలు ఒక “గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని” కలిగి ఉన్నాయని, దానిని ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఉపయోగించుకోవాలని పోప్ అన్నారు.

“మానవత్వాన్ని పునరుజ్జీవింపజేయడానికి, బాధపడేవారికి గొంతుకగా నిలవడానికి, మరియు ఉదాసీనతను ఐక్యతగా మార్చడానికి మనం పిలవబడ్డాము,” అని పోప్ అన్నారు. రోజురోజుకు చీలిపోతున్న ప్రపంచంలో మతాల మధ్య ఐక్యతను పోప్ కోరారు.

మూలం:వాటికన్ న్యూస్

 

ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు What you should know about Lung Cancer

 

Medical professional examining lung X-ray for signs of lung cancer.

-

ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి ఉన్న అతిపెద్ద అపోహ ఏమిటంటే అది కేవలం పొగతాగేవారికే వస్తుందని. పొగాకు ప్రధాన కారణంగా ఉన్నప్పటికీ, పొగతాగని వారిలో, ముఖ్యంగా మహిళలలో, ఈ వ్యాధి నిర్ధారణ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వాయు కాలుష్యం, సరిగా గాలి ప్రసరణ లేని వంటగదులలో వంట పొగలు, వృత్తిపరంగా రసాయనాలకు గురికావడం, మరియు జన్యుపరమైన కారకాలు అన్నీ పాత్ర పోషిస్తాయి.

మీరు నిర్లక్ష్యం చేయకూడని హెచ్చరిక సంకేతాలు

కింది లక్షణాలలో ఏవైనా రెండు నుండి మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించండి. తగ్గని లేదా తీవ్రమయ్యే దగ్గు. కొద్దిగా అయినా సరే, దగ్గులో రక్తం పడటం. లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు తీవ్రమయ్యే ఛాతీ నొప్పి.  కారణం తెలియని ఆయాసం. గొంతు బొంగురుపోవడం. కారణం తెలియని బరువు తగ్గడం. పదేపదే తిరగవస్తున్న ఛాతీ ఇన్ఫెక్షన్లు.

స్క్రీనింగ్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందుగానే గుర్తించవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ తరచుగా దాని ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలను చూపించదు, కానీ నిరూపితమైన స్క్రీనింగ్ సాధనం ఉంది — అదే ఛాతీకి చేసే తక్కువ-మోతాదు CT స్కాన్. 50 ఏళ్లు పైబడిన, ఎక్కువగా ధూమపానం చేసేవారికి మరియు దీర్ఘకాలంగా ధూమపానం చేసేవారికి, ఈ సులభమైన, వేగవంతమైన స్కాన్ క్యాన్సర్‌లను అవి చాలా చిన్నవిగా, ఇంకా పూర్తిగా నయం చేయగల దశలో ఉన్నప్పుడే గుర్తించగలదు. అధిక ప్రమాదం ఉన్న ధూమపానం చేసేవారిలో CT స్క్రీనింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలను గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనాలు చూపించాయి. సంవత్సరాలుగా ఎక్కువగా ధూమపానం చేస్తున్న ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేయించుకోవడం గురించి కోరుతున్నాను. అది ప్రాణాలను కాపాడగలదు.

చికిత్స రూపాంతరం చెందింది.

ఈ రోజు ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స, ఒక దశాబ్దం క్రితం ఉన్నదానిలా ఏమాత్రం లేదు. ఇప్పుడు మనం ప్రతి క్యాన్సర్‌ను జన్యు ఉత్పరివర్తనాల genetic mutations కోసం పరీక్షిస్తున్నాము. భారతీయ రోగులలో, EGFR వంటి ఉత్పరివర్తనాలు చాలా సాధారణం, మరియు ఈ వ్యాధిని సంవత్సరాల తరబడి నియంత్రించగల లక్షిత మాత్రలు targeted tablets మన వద్ద ఉన్నాయి. ఇమ్యునోథెరపీ ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది.

కేవలం పది, పదిహేను సంవత్సరాల క్రితం ఊహించలేని ఒక విషయాన్ని పంచుకోబోతున్నాను ఒకప్పుడు మరణశిక్షగా, బతికే అవకాశాలు కొన్ని నెలల్లోనే ఆగిపోయేవిగా భావించిన స్టేజ్ IV, ఇప్పుడు చాలా మంది రోగులు దానితో చనిపోవడం లేదు, కేవలం జీవిస్తున్నారు.

గమనిక: మీరు ధూమపానం చేస్తే, మానేయండి. మానేసిన క్షణం నుంచే ప్రమాదం తగ్గుతుంది. మీరు ధూమపానం చేయకపోతే, లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండండి, మరియు ముందుగానే చర్యలు తీసుకోండి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇకపై నిరాశ కలిగించే వ్యాధి కాదు. కానీ అంతా దానిని సకాలంలో గుర్తించడంపైనే ఆధారపడి ఉంటుంది.

తెలుగు అనువాదం: సల్మాన్ హైదర్