20 September 2025

అమీనా హైదరి తయ్యబ్జీ: ఖైసర్-ఇ-హింద్ బిరుదు గ్రహీత, హైదరాబాద్‌లో మహిళా సాధికారత మరియు సామాజిక మార్పు రూపశిల్పి Amina Hydari Tayyabji: Qaisar-i-Hind Honoured, Architect of Women's Empowerment and Social Change in Hyderabad

 

 

1878లో జన్మించిన అమీనా హైదరి తయ్యబ్జీ, హైదరాబాద్‌లో మార్గదర్శక సామాజిక సంస్కర్త. 1908 ముసీ వరదల సమయంలో చేసిన కృషికి కైసర్-ఇ-హింద్ అవార్డును అందుకున్న అమీనా హైదరి, మహబూబియా బాలికల పాఠశాల మరియు లేడీ హైదరి క్లబ్‌ను స్థాపించి, 1939లో మరణించే వరకు మహిళలకు సాధికారత కల్పించింది.

"తయ్యబ్జీ" కుటుంబం భారత స్వాతంత్ర్య ఉద్యమం మరియు సామాజిక సంస్కరణలలో గణనీయమైన పాత్ర పోషించింది. మేధో సామర్థ్యాలు, దేశభక్తి మరియు సామాజిక సేవ లో "తయ్యబ్జీ" కుటుంబం లోని పురుషులు-మహిళలు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషించారు.

"అమీనా హైదరి తయ్యబ్జీ"అసలు పేరు అమీనా నజ్ముద్దీన్ తయ్యబ్జీ. అమీనా హైదరి తయ్యబ్జీ 1878లో హైదరాబాద్‌లో జన్మించారు. అమీనా హైదరి తయ్యబ్జీ ప్రఖ్యాత రాజకీయ నాయకుడు మరియు భారతీయ న్యాయవాది బద్రుద్దీన్ తయ్యబ్జీ మేనకోడలు.

అమీనా హైదరి తండ్రి పేరు అల్-హజ్ ముల్లా నజ్ముద్దీన్ తయ్యబ్జీ మరియు తల్లి పేరు దుర్రత్-ఉల్-సదాఫ్. ముల్లా నజ్ముద్దీన్ తయ్యబ్జీ కుటుంభం సమాజం లో గొప్ప పేరు ప్రఖ్యాతులు గల కుటుంభం.

అమీనా,  సర్ ముహమ్మద్ అక్బర్ నాజర్ హైదరిని వివాహం చేసుకున్నారు. సర్ అక్బర్ హైదరి 1937 నుండి 1941 వరకు హైదరాబాద్ స్టేట్  ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు.

అమీనా హైదరి, సామాజిక కార్యకర్త అమీనా హైదరి ప్రధానంగా "ది గ్రేట్ మూసి వరద"కు చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. 1908 సెప్టెంబర్ 28న, హైదరాబాద్‌లోని మూసి నది కి వరద సంభవించింది, దీనిని ది గ్రేట్ మూసి వరద అని కూడా పిలుస్తారు.

మూసి వరదలో సుమారు 15 వేల మంది మరణించారని మరియు 80 వేల ఇళ్ళు ధ్వంసమయ్యాయని నమ్ముతారు. అమీనా హైదరి ప్రజల మధ్య సహాయ మరియు రక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అమీనా హైదరి గర్భవతిగా ఉన్నప్పటికీ, ముందుకు వచ్చి వరద బాధిత ప్రజల పునరావాసంలో సహాయం చేసింది. అమీనా హైదరి చేసిన ఈ గొప్ప పనికి గాను  ఆమెకు 1908లో "కైసర్-ఇ-హింద్" పతకం లభించింది. సామాజిక సేవకు గాను ఈ గౌరవం పొందిన మొట్ట మొదటి ముస్లిం మహిళ అమీనా హైదరి

అమీనా హైదరి ఎల్లప్పుడూ బాలికల విద్య కోసం కృషి చేసేవారు. ఆ సమయంలో, బాలికలకు మతపరమైన విద్య మాత్రమే అందించబడేది. అమీనా హైదరి, సరోజినీ నాయుడుతో కలిసి, హైదరాబాద్ నిజాంను బాలికల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను ప్రారంభించమని కోరారు. అమీనా హైదరి ప్రయత్నాల కారణంగా, 1907లో "మహబూబియా బాలికల పాఠశాల" స్థాపించబడింది. ఇది హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి బాలికల పాఠశాల. ఈ పాఠశాల బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలను అందించింది. ఈ పాఠశాల ఇప్పటికీ బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంలో మార్గదర్శకంగా ఉంది.

అమీనా హైదరి 1901లో "లేడీ హైదరి క్లబ్"ను స్థాపించారు.ప్రారంభంలో, ఈ క్లబ్‌ను హైదరాబాద్ లేడీస్ అసోసియేషన్ అని పిలిచేవారు, తరువాత దాని పేరు "లేడీ హైదరి క్లబ్"గా మార్చారు. “లేడీ హైదరి క్లబ్” లో అనేక కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. మహిళలు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. విద్యా కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న మహిళలకు, వంట, కుట్టుపని, ఎంబ్రాయిడరీ మరియు క్రీడలలో ఆసక్తి ఉన్న మహిళలకు, టెన్నిస్ మరియు ఇతర ఇండోర్ ఆటలను ఏర్పాటు చేశారు.

లేడీ హైదరి క్లబ్” కు  ప్రారంభ దశలో, హైదరాబాద్‌లోని ఉన్నత కుటుంబాల నుండి మరియు బ్రిటిష్ కుటుంభాల నుండి మహిళలు మాత్రమే వచ్చేవారు, కానీ క్రమంగా వివిధ సామాజిక తరగతుల నుండి మహిళలు లేడీ హైదరి క్లబ్‌కు హాజరు కావడం ప్రారంభించారు.

లేడీ హైదరి క్లబ్” లోని ఒక భాగాన్ని లైబ్రరీగా ఉపయోగించారు, మరొక భాగంలో, పేద తరగతుల పిల్లల కోసం ఒక పాఠశాలను నడిపారు. పర్దా ఆచరించే మహిళల ప్రవేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

లేడీ హైదరి క్లబ్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని మహిళలకు ఒక ప్రత్యేకమైన సామాజిక కేంద్రం, అక్కడ వారు సామాజిక కార్యక్రమాలు మరియు సమావేశాలలో పాల్గొనేవారు.

1952లో, ఎలియనోర్ రూజ్‌వెల్ట్ “లేడీ హైదరి క్లబ్‌”ను సందర్శించి ప్రసంగించారు, ఇది “లేడీ హైదరి క్లబ్” ప్రతిష్ట మరియు అంతర్జాతీయ సంబంధాన్ని హైలైట్ చేస్తుంది.

లేడీ హైదరి క్లబ్” కు ఒక గొప్ప ప్రవేశ ద్వారం 1929లో నిర్మించబడింది. లేడీ హైదరి క్లబ్” ను ఒట్టోమన్ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు.

అమీనా హైదరి 1939లో 61 సంవత్సరాల వయసులో మరణించారు. మహిళల పరిస్థితిని మెరుగుపరచడానికి అమీనా హైదరి తన జీవితంలో అనేక అద్భుతమైన పనులు చేశారు, దీని కోసం లేడీ అమీనా హైదరి ఎల్లప్పుడూ గుర్తుంచుకోబడుతుంది.

 

 

.

 

 

 

No comments:

Post a Comment