16 September 2026

ముస్లిం మహిళా పండితుల విస్మరించబడిన వారసత్వం The Forgotten Legacy of Muslim Women Scholars

 

 

ఇస్లామిక్ న్యాయశాస్త్రం మరియు చట్ట రంగంలో ముస్లిం మహిళలు  గణనీయమైన కృషి చేసారు. ఇస్లాం తొలి శతాబ్దాలలో ముస్లిం మహిళలు  లౌకిక మరియు మతపరమైన వివిధ రంగాలలో అత్యంత చురుకుగా ఉండేవారు. ముస్లిం మహిళలు  ఇస్లామిక్ జ్ఞానాన్ని, చట్టాన్ని నేర్చుకోవడానికి ఎటువంటి నిషేధం లేదు. వారు నేర్చుకున్న దానిని ప్రచారం చేయడంలో కూడా వారిపై ఎటువంటి ఆంక్షలు లేవు. ఇస్లాం తొలి రోజుల్లో పురుషులు మహిళల నుండి నేర్చుకోవడానికి సంకోచించలేదు లేదా సిగ్గుపడలేదు.

దివ్య ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనల ప్రకారం  ఇస్లాంలో మహిళలకు మతపరమైన మరియు ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించడానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా, స్త్రీపురుషుల సమావేశాలు నిర్వహించడం ద్వారా మరియు ఆధునిక మార్గాల ద్వారా దానిని వ్యాప్తి చేయడానికి కూడా అవకాశం కలదు. ఇస్లామిక్ న్యాయశాస్త్రం మరియు చట్టం గురించి జ్ఞానాన్ని సంపాదించడానికి మహిళలను ప్రోత్సహించడం జరిగింది.

జ్ఞాన సముపార్జన విషయంలో ఇస్లాం స్త్రీపురుషుల మధ్య ఎలాంటి వివక్ష చూపదు. ఇస్లాం స్త్రీపురుషులిద్దరినీ జ్ఞానాన్ని పొందడానికి మరియు ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి ఎదగడానికి అనుమతిస్తుంది. "జ్ఞానాన్ని సంపాదించడం ప్రతి ముస్లింపై విధి" అని ప్రవక్త(స) అన్నారు.

"ముస్లిం" అనే పదము  స్త్రీపురుషులు ఇద్దరినీ సూచిస్తుంది. అందువల్ల, జ్ఞానాన్ని సంపాదించాలనే ఆదేశం ముస్లిం స్త్రీపురుషులకు సమానంగా వర్తిస్తుంది.

మహిళల అభ్యర్థన మేరకు, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు, అక్కడ ఆయన కేవలం మహిళల సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చేవారు. ఈ ఏర్పాటు, మిశ్రమ సమావేశాలలో తాము సిగ్గుపడి లేదా సంకోచించి ప్రస్తావించే విషయాల గురించి మహిళలు స్వేచ్ఛగా ప్రశ్నలు అడగడానికి వీలుగా వారికి ఒక సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించింది.

ప్రవక్త(స) అందించిన ఇటువంటి ప్రోత్సాహం చాలా మంది మహిళలను జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రేరేపించింది. ఇస్లాం రాకకు ముందు, మహిళలకు చదవడం, రాయడం నేర్చుకోవడానికి అనుమతి ఉండేది కాదు. ఇస్లాం ఆవిర్భావం తరువాత చాలా మంది మహిళలు రచన మరియు కాలిగ్రఫీ కళలో నైపుణ్యం సాధించారు. మరియు చాలా మంది హాఫిజాలుగా (ఖురాన్‌ను కంఠస్థం చేసినవారు) కూడా మారారు.

 ప్రవక్త(స) తన భార్యలలో ఒకరైన హజ్రత్ హఫ్సా బింత్ ఉమర్‌కు, తన మహిళా సహచరులలో ఒకరైన షిఫా బింత్ అబ్దుల్లా వద్ద చదువు నేర్పించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా మహిళలు ఖురాన్ యొక్క సరైన పఠనం, తఫ్సీర్ (ఖురాన్ యొక్క వ్యాఖ్యానం మరియు వివరణ), సాహిత్యం, కవిత్వం, మరియు ఆ కాలంలోని వైద్య శాస్త్రాలతో సహా ఇస్లాం యొక్క అన్ని శాఖలలో జ్ఞానాన్ని సంపాదించారు.

అల్లామా ఇబ్న్-ఎ-ఖయ్యిమ్‌ ప్రకారం, ఇస్లామిక్ చరిత్ర పుస్తకాలలో ప్రవక్త యొక్క 130 మంది సహచరుల ఫత్వాలు (మతపరమైన సలహా అభిప్రాయాలు) అందుబాటులో ఉన్నాయి. వారిలో 22 మంది మహిళా పండితులు ఉన్నారు. తొలికాలానికి చెందిన ఈ మహిళా పండితుల ఫత్వాలను సంకలనం చేస్తే, అవి అనేక పుస్తకాలుగా రూపొందగలవు.

అల్లామా ఇబ్న్-ఎ-ఖయ్యిమ్ ప్రకారం, ప్రవక్త(స) గారి భార్యలైన హజ్రత్ ఆయిషా బింత్ అబీ బక్రా మరియు హజ్రత్ ఉమ్మే సల్మా, పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోనూ ఇస్లామిక్ న్యాయశాస్త్రం మరియు చట్ట రంగంలోని అగ్రశ్రేణి పండితులలో ఉన్నారు. 20 మంది ప్రముఖ మహిళా ఇస్లామిక్ పండితులలో హజ్రత్ హఫ్సా బింత్ ఉమర్, హజ్రత్ ఉమ్మె హబీబా బింత్ అబీ సుఫ్యాన్, హజ్రత్ లైలా బింత్ ఖనీఫ్ అస్-సఖఫియా, హజ్రత్ అస్మా బింత్ అబీ బక్రా, హజ్రత్ ఉమ్మె షరీక్, హజ్రత్ హౌలా బింత్ తువైత్ అల్-అసదియా, హజ్రత్ ఉమ్మె దర్దా-ఉల్-కుబ్రా బింత్ అబీ హర్దల్ అస్లామీ, హజ్రత్ అతికా బింత్ జైద్ బిన్ ఉమ్రో, హజ్రత్ సహ్లా బింత్ సుహైల్, ఉమ్ముల్ ముమినీన్ హజ్రత్ జువైరియా బింత్ హారిస్, ఉమ్ముల్ ముమినీన్ హజ్రత్ మైమూనా బింత్ హారిస్, ప్రవక్త ముహమ్మద్ కుమార్తె హజ్రత్ ఫాతిమా, హజ్రత్ ఫాతిమా బింత్ ఖైస్, హజ్రత్ ఉమ్మె సలీమ్, హజ్రత్ జైనబ్ బింత్ అబీ సల్మా, హజ్రత్ ఉమ్మ్ అయ్మాన్ అల్-హబషీయా, హజ్రత్ ఉమ్మె యూసుఫ్ అల్-హబషీయా మరియు హజ్రత్ ఘమిదియా ఉన్నారు.

ఉమ్ముల్ ముమినీన్ హజ్రత్ ఆయిషా 2210కి పైగా హదీసులను (ప్రవక్త ముహమ్మద్ చేసిన వ్యాఖ్యలు లేదా బోధనలు) ఉల్లేఖించినట్లుగా చెప్పబడింది; హజ్రత్ ఆయిషా కు ఖురాన్ పట్ల ఎంతటి అపారమైన జ్ఞానం ఉండేదంటే, ఖురాన్ ఆయతుల అర్థం పూర్తిగా అర్థం కాని సందర్భాల్లో ఖలీఫా హజ్రత్ ఉమర్‌తో సహా అనేకమంది సహాబాలు (ప్రవక్త అనుచరులు) హజ్రత్ ఆయిషా వద్దకు వచ్చి వివరణలు అడిగేవారు. జ్ఞానపరంగా హజ్రత్ ఆయిషా స్థాయి అటువంటిది. ఆమె వద్ద ఖురాన్ మరియు హదీసుల వ్యాఖ్యానాన్ని నేర్చుకునే అనేకమంది పురుష శిష్యులు కూడా ఉండేవారు. ఇస్లాం ప్రారంభ కాలంలో సామాన్య ప్రజలలో ఖురాన్ మరియు హదీసుల బోధనలను వ్యాప్తి చేయడంలో మహిళలు కృషి చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ.

ఇస్లామిక్ న్యాయశాస్త్రం (ఫిఖ్) మరియు చట్టాల అభివృద్ధిలో మహిళల కూడా కీలక పాత్రను వహించారు. ఇస్లామిక్ చరిత్ర అంతటా కనీసం 2,500 నుండి 4,000 మంది మహిళలు సంక్లిష్ట న్యాయ ఆలోచనాపరులుగా, న్యాయశాస్త్ర ప్రధాన కథకులుగా మరియు ప్రముఖ పురుష పండితులకు ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఇస్లాం ఆవిర్భావ మరియు మధ్యయుగ యుగాలలో, మహిళలు కేంద్ర అధికార వ్యక్తులుగా, న్యాయవేత్తలుగా (ముఫ్తీలు) మరియు న్యాయ పండితులుగా (ఫఖీహాత్) ఉండేవారు.


ప్రముఖ చారిత్రక మహిళా న్యాయవేత్తలు:

ఆయిషా బింత్ అబీ బక్ర్ (ర.అ.): ప్రవక్త ముహమ్మద్ గారి భార్య, న్యాయశాస్త్రంలో ఒక ప్రాథమిక నిపుణురాలు. హజ్రత్ ఆయిషా వేలాది హదీసులను వివరించారు మరియు పురుష సహచరుల కోసం గ్రంథాలను సరిదిద్దుతూ, వ్యాఖ్యానిస్తూ ప్రధాన న్యాయ తీర్పులను (ఫత్వాలను) జారీ చేశారు.

అమ్రా బింత్ అల్-రహ్మాన్ (7వ శతాబ్దం): మదీనాకు చెందిన ఈ న్యాయవేత్తను సమకాలీన పండితులు "అనంతమైన జ్ఞాన సముద్రం"గా అభివర్ణించారు. ఆమె ఒక ప్రాథమిక న్యాయాధికారిగా వ్యవహరించారు, మరియు అమ్రా బింత్ అల్-రహ్మాన్ న్యాయపరమైన తీర్పులు స్థానిక న్యాయమూర్తులు మరియు గవర్నర్ల నిర్ణయాలను అధిగమించాయని ప్రసిద్ధి చెందింది.

ఉమ్ అల్-దర్దా (7వ శతాబ్దం): డమాస్కస్ మరియు జెరూసలేంలో ఒక ప్రఖ్యాత న్యాయవేత్త, ఉమ్ అల్-దర్దా పురుష సహచరులతో పాటు న్యాయశాస్త్రం మరియు హదీసులను బోధించారు. ఉమ్ అల్-దర్దా విద్యార్థులలో ప్రముఖ పురుష పండితులు మరియు ఖలీఫా అబ్ద్ అల్-మాలిక్ ఇబ్న్ మర్వాన్ ఉన్నారు.

ఫాతిమా అల్-బతయాహియ్యా (8వ శతాబ్దం): ఫాతిమా అల్-బతయాహియ్యా  ఒక ప్రసిద్ధ పండితురాలు. ఫాతిమా అల్-బతయాహియ్యా  డమాస్కస్‌లో మరియు మదీనాలోని ప్రవక్త మసీదులో ఉన్నత వర్గానికి చెందిన పురుష పండితుల సమూహాలకు సహీహ్ అల్-బుఖారీ వంటి ప్రధాన హదీస్ గ్రంథాలను బోధించారు.

సుతైతా అల్-మహామిలీ (10వ శతాబ్దం): సుతైతా అల్-మహామిలీ బాగ్దాద్‌కు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సుతైతా అల్-మహామిలీ అరబిక్ సాహిత్యం, హదీస్, న్యాయశాస్త్రం మరియు గణితశాస్త్రంలో రాణించారు. సుతైతా అల్-మహామిలీ తర్వాతి పండితులు ఉపయోగించుకున్న బీజగణిత పరిష్కారాలను కనుగొన్నారు.

ఫాతిమా అల్-సమర్ఖండి (12వ శతాబ్దం): మధ్య ఆసియాకు చెందిన ఒక ప్రతిభావంతురాలైన న్యాయవేత్త, ఫాతిమా అల్-సమర్ఖండి తన ప్రసిద్ధ భర్త యొక్క న్యాయ గ్రంథాలను సవరించి, సరిదిద్దారు మరియు ప్రముఖ న్యాయమూర్తులు గౌరవించే అధికారిక ఫత్వాలను స్వతంత్రంగా జారీ చేశారు.

      ఆయిషా అల్-బావునియ్య (16వ శతాబ్దం): డమాస్కస్‌లో జన్మించిన సూఫీ గురువు మరియు న్యాయశాస్త్ర పండితురాలు ఆయిషా అల్-బావునియ్య కైరోకు ప్రయాణించి, అక్కడ 'ఇఫ్తా' (స్వతంత్ర న్యాయపరమైన తీర్పులను జారీ చేసే అధికారం) మరియు బోధనలో అధికారిక ధృవీకరణను పొందారు.

No comments:

Post a Comment