1 December 2013

“ఇస్లాం పై పెరియార్ ఈ.వి. రామస్వామి ఉపన్యాసాలు”

              దక్షిణ భారత దేశ ప్రజలచే ముఖ్యం గా తమిళనాడు ప్రజలచే “పెరియార్”, తాన్ తై పెరియార్  లేదా ఈ.వి.ఆర్. గా  ప్రేమగా పిలవ బడే ఈరోడ్ వెంకట రామస్వామి  జననం 17-09-1879 న ఈరోడ్ లో  జరిగినది.పెరియార్ అంటే  మహామనిషి లేదా పెద్దమనిషి అని అర్థం. వ్యాపారి, రాజకీయ వేత్త ,సామాజిక వేత్త,స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి,.సంఘ సంస్కర్త,హేతువాది,ఆత్మగౌరవ(స్వాభిమాన)  ఉద్యమనిర్మాత,ద్రావిడ ఉద్యమ సారధి,  ప్రత్యేక ద్రవిడనాడు ఏర్పాటు అభిలాషిగా, ద్రావిడ కజగం  స్థాపకుడి గా   ఈ.వి.ఆర్. లేదా పెరియార్ ప్రసిద్ది  చెంధినాడు.

                    హేతువాదం, ఆత్మ-గౌరవం లేదా స్వాభిమానం ,స్త్రీల హక్కులు,సాంఘిక సంస్కరణలు లేదా కుల నిర్మూలన కొరకు పెరియార్ పాటుపడినాడు. మూల-ద్రావిడ వాసులైన బ్రహ్మణేతరులను, ఆర్య భారత దేశానికి చెందిన బ్రాహ్మణులు దోపిడి చేయడాన్ని,అణిచివేయడాన్ని  వ్యతిరేకించినాడు. బ్రాహ్మణ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాడు.  తమిళ సమాజాన్ని విప్లవ పంధా లో నడిపి కుల వివక్షతను తొలగించడానికి తీవ్రంగ కృషి చేసినాడు. ఆధునిక కాల ప్రవక్తగా,ఆగ్నేయ ఆసియా సోక్రటీస్ గా, సామాజిక విప్లవ పితామహునిగా,అజ్ఞానం,అంధవిశ్వాసాలు, అసంబద్ధమైన ఆచార-వ్యవహారాలను వ్యతిరేకించినవానిగా యునెస్కో తన అవార్డ్ లో  పెరియార్ ను అబివర్ణించినది. 94 సం. ల వయస్సులో 1973 లో పెరియార్ పరమపదించేను.

          అంటరానితనం,కులం, వర్ణ వివక్షతలతో కూడిన హిందూ మతంలోని  అణగారిన కులాలు మరో మతంలో లోకి మారడమనేది సామాజిక పరిస్థితుల వల్ల  అనివార్యమవుతుంది. అలాంటి పరిస్థితులలో సర్వమానవ సమానత్వాన్ని తద్వారా సామాజిక సృహుద్భావాన్ని ప్రోత్సహిస్తున్న మతంగా ఇస్లాం ప్రముఖంగా కన్పిస్తుంధి. బిపిన్ చంద్ర పాల్ ఇలా అంటాడు: “ఆయా కులాల సమాజాల సబ్యులుగా మనకున్న ప్రత్యేక హోదాకు తోడు మనకు రాజకీయ హక్కును ఇచ్చింది మహమ్మదీయులే. అందులోనే ప్రజాస్వామ్యానికి పునాది ఉంది. అందులోనే నిజమైన జాతీయ జీవనం ఉంది. అందులోనే నిజమైన పౌర సమానత్వానికి ఆధారముంది. (బి.ఎన్. గంగూలీ,1975:61) నవీన హిందూ సిద్దాంత కర్త స్వామి వివేకానంద కూడా ఇలా అన్నారు: “వాస్తవికంగా నిత్య జీవన విధానంలో ఏమాత్రం ప్రశంసనీయమైన స్థాయిలో నైనా సమానాత్వాన్ని, ఏ మతమైన పాటిస్తుదంటే అది ఇస్లాం ...... కేవలం ఇస్లాం మాత్రమే”(బి.ఎన్. గంగూలీ 1975 పేజ్ న.120)

          ఈ దేశ ప్రజలలో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వారి మద్య సామాజిక ఆర్థిక సమానాత్వాన్నిసాధించడం బ్రాహ్మణ కుల వ్యవస్థను, దోపిడి మయమైన సాంప్రదాయాలను నిర్మూలించడం పెరియార్ ద్యెయము.హిందూ మతం ఆపాదించిన తరతరాల బానిసత్వాన్ని వదిలించుకునేందుకు “దేవుడు ఒక్కడే-మనుషులంతా ఒక్కటే” అని చాటే ఇస్లాం మతంలో చేరడం మంచిదని ప్రభోదించాడు. ఆయన భావాలు, ఆలోచనలు ఎప్పుడు విప్లవాత్మకమైనవే.

నిరాకారత, ఏకేశ్వరోపాసన, స్త్రీ-పురుషులకు సమాన హక్కులను ప్రసాదించే,సాంఘిక సమానత్వంను చాటే మతంగా ఇస్లాం ను పెరియార్ పొగిడినాడు. ప్రాచీన ద్రావిడుల మూలమత విశ్వాసాలను  ముస్లింలు అనుసరిస్తున్నారు అని పెరియార్  అనెను.బ్రాహ్మణవాదం ఈ దేశములో విస్తరించబడినప్పుడు ,మహమ్మద్ నబీ దానిని వ్యతిరేకించేను మరియు ద్రావిడ మత సిద్ధాంతాలను ఇస్లాం పేరుతో ప్రజల మనసులలో నాటెను అని తిరిచ్చి ఊరేగింపులో పెరియార్ అబిప్రాయ పడేను.. హిందూ సమాజం లోని అణిచివేయబడిన లేదా పీడిత వర్గాలను లను ఇస్లాం, క్రైస్తవ లేదా భౌద్దమతంల లొనికి మారమని పెరియార్ బాహాటంగా చాటినాడు.

ఇస్లాం మతానికి సంబంధించి పెరియార్ ప్రత్యేకించి ఐదు ఉపన్యాసాలు చేసెను. మొదటి ఉపన్యాసం 1929 లో ఈరోడ్ లో చేసెను. రెండవది  1947 లో జరిగిన తీరుచునాపల్లి రైల్వే ఉద్యోగుల సమావేశంలో చేసెను.  ఆ ఉపన్యాసంపై  తన అనుచరులనుంచి వచ్చిన నిర్ధిష్ట  అబ్యంతరాలకు సమాధానం గా మూడు, నాలుగు ఉపన్యాసాలు చేసెను. జాతిపరమైన హెచ్చు తగ్గులకు ఇస్లామే సరైన విరుగుడు అనే పేరుతో కర పత్రాల రూపంలో పెరియార్ మూడు,నాలుగు  ఉపన్యాసాలు వచ్చాయి. ఐదో ఉపన్యాసం 1953 లో  చెన్నై లో   మహమ్మద్ ప్రవక్త (స.ఆ.స.)జయంతి సంధర్భంగా చేసెను.వివిధ ప్రాంతాలలో చేసిన ఈ ప్రసంగాలు ఆ తదనంతరం పెరియార్ సంపాదకత్వంలో వెలుబడే  “కుడియారను” అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. తన అన్నీ ఉపన్యాసాలలోను కులపరంగా అణగారిన వర్గాలకు సర్వ మానవ సమానత్వంతో కూడిన మానవీయ జీవనాన్ని ప్రసాదించేదిగా ఇస్లాంను పెరియార్ కీర్తించేను.

          1929 లో ఈరోడ్ లో ఇస్లాం పై చేసిన తన తొలి ఉపన్యాసంలో పెరియార్ ముస్లింలుగా మారిన 69 మండి ఆది ద్రావిడుల చర్యను ప్రశంసించేను. హిందూసమాజం నిజమైన సమానత్వాన్ని, సమైక్యతని సాదించేవారకు అంటరానివాళ్లు సాహుహికంగా ముస్లింలుగా మారడం మినహా మరొక గత్యంతరం లేదు అని అన్నాడు. అంటరానివాళ్లు తమ అంటరానితనాన్ని వదిలించుకోడానికి ఇస్లామే సరైన మతమని సిఫారసు చేయాలనేది నా అబిప్రాయం అని పెరియార్ అన్నారు. మనదేశంలో అంటరానితనం పోవాలనుకునే వాళ్ళు, సామాజికి సృహుద్భావము నెలకొనాలని ఆకాంక్షించేవాళ్లు, జనంలో ఆత్మ  గౌరవం నెలకొల్పాలని ఆశించేవాళ్లు అందరూ కూడా అంటరానివాళ్లు మహమ్మదీయులుగా మారడాన్ని  అడ్డుకోకూడదని సవినయంగా మనవి చేస్తున్నానని పెరియార్ అనెను.

          1947 లో తీరుచునాపల్లి రైల్వే ఉద్యోగుల సమావేశం  లో పెరియార్ ఇస్లాం పై తన రెండవ ప్రసంగం చేసెను. ఈ ప్రసంగం లో పెరియార్ మన వ్యవహారాలని మనం చక్కదిద్దుకోవాలంటే ఇస్లాం ఒక్కటే మార్గమని అన్నారు. ఆయన ఉద్దేశంలోఇస్లాం ద్రావిడులకు కొత్త సిద్ధాంతం కాదు.  ప్రాచీన ద్రావిడ మత సిద్దాంతలకు ప్రతి రూపమే ఇస్లాం.శాంతి, సమైక్యత, పరస్పర గౌరవం, భక్తిభావం, సహోదరత్వం వంటి లక్షణాలు కలిగిన ద్రావిడ “కాడవూల్”కు ప్రతిరూపమే అరబ్బీలో లో అల్లాహ్ . శాంతి, నిజమైన సౌబ్రాతృత్వం,సమైక్యత, క్రమశిక్షణతో కూడిన జీవన మార్గం ఇస్లాం అని పెరియార్ అభిప్రాయపడినాడు. హిందూ మతంలోని కుల వ్యవస్థ వల్ల సంభవిస్తున్న దుష్పరిణామాలకు విరుగుడుగా శూద్రులు, అతిశూద్రులు ఇస్లాం మతాన్ని  స్వీకరించి తమ స్థితిని మేరుగుపరుచుకోవాలని ఆ ఉపన్యాసంలో   పెరియార్ సూచించినాడు. ద్రావిడుల జాతిపరమైన నీచస్థాయి కి సరైన విరుగుడు ఇస్లాం అని నమ్మాడు.

          1947 లో తిరిచ్చి, కుంభకోణాలలో తను చేసిన ఉపన్యాసాలకు వ్యతిరేకంగా తన అనుచరులనుంచి వచ్చిన నిర్ధిష్ట  అబ్యంతరాలకు సమాధానం గా మూడు, నాలుగు ఉపన్యాసాలు చేసెను. జాతిపరమైన హెచ్చు తగ్గులకు ఇస్లామే సరైన విరుగుడు అనే పేరుతో కర పత్రాల రూపంలో కూడా పెరియార్ మూడు,నాలుగు  ఉపన్యాసాలు వచ్చాయి ఈ ఉపన్యాసాలలో ఇస్లాం లో ఎందుకు చేరాలి?శూద్రుడిగా మిగిలిపోయినందుకు సిగ్గు పడుతున్నాను! అనే భావనలను పెరియార్ వివరించేను.

          ఇస్లాం లో ఎందుకు చేరాలో తన మూడోవలేఖలో పెరియార్  వివరిస్తూ ఇస్లాం లో కుల వివక్షత లేదు, మానవుల మద్య వర్గవిభేదాలు లేవు. ఇస్లాం ఒకే దేవుడు, ఒకే కులం అనే ప్రాతిపదికపై ఏర్పడినది.వాళ్ళదంతా ఒకే కుటుంబం, ఒకే దివ్యత్వం కాబట్టి ద్రావిడులకు కూడా ఈ సూత్రాల ఆవశ్యకత ఎంతో ఉంది అన్నాడు.ఒకే దేముడు, ఒకే సమాజం(ఒకే కులం) నెలకొల్పేందుకు, మూఢనమ్మకాలని, విగ్రహారాధనని రూపు మాపి, జనాన్ని హేతుబద్దంగా ఏకం చేసేందుకు ఇస్లాం తోడ్పడుతుంది.  జనాభాలో 3% ఉన్న బ్రాహ్మణుల  మద్య క్రిందిస్థాయి  జీవితం గడుపుతూ,బానిసత్వంతో అగౌరవంగా చూడబడటం కన్నా, 10% జనాభా కల ముస్లింలతో స్వేచ్చగా,సగౌరవంగా సౌబ్రాతృత్వ సంబంధాల మద్య జీవించడానికి హర్షించాలి కాబట్టి మనమంతా ఇస్లాం స్వీకరించాలని పెరియార్ పిలుపు ఇచ్చేను.

          తన నాలుగోవ ప్రసంగంలో పెరియార్ హిందూ సమాజం లో ద్రావిడుల,ఆదిద్రావిడుల దౌర్భాగ్య స్థితికి, తక్కువ స్థాయికి వారు హిందువులు కావడమే ప్రధాన కారణమని నమ్మాడు. అందుకు ద్రావిడులు, ఆదిద్రావిడులు తమ ఆత్మగౌరవం కోసం, తమ నికృష్ట స్థాయిని వదిలించుకోవడం కోసం ఇస్లాం  ను స్వీకరించమని సూచిస్తే దీంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు తనపై ఎందుకు విరుచుకుపడుతున్నారని ప్రశ్నించేను? ఇస్లాం అంటే ఒకే దేవుడు ఒకే కులం, సౌబ్రాతృత్వ భావన. అంటరానితనాన్ని నిర్మూలించాలని కోరుకొనేవాళ్లూ, అంటరానివాళ్లు అన్న ముద్రనుంచి బయటపడాలనుకునేవాళ్లు, ముస్లింలుగా మారాలని పెరియార్ ఆయా కులాలకు సూచించేను. దీని వల్ల వాళ్ళ స్థాయి మారుతుంది,హక్కులు లబించును,వాళ్ళ సమస్యలకు పరిష్కారం లబించును. ఇది ఆత్మగౌరవం,మానవీయ ఔనత్యాన్ని,సహోదర భావాన్ని, శాశ్వత శాంతిని, సమానాత్వాన్ని, సమాన స్వేచ్చను పెంపొందించే చర్య కదా అని అబిప్రాయ పడేను.

          1953 లో చెన్నై లో మహమ్మద్ నబీ జయంతి ఉత్సవాలలలో చేసిన తన ఐదవ ప్రసంగంలో పెరియార్ మహమ్మద్ నబీ ను కీర్తించినాడు. పెరియార్ మాట్లాడుతూ మహమ్మద్ నబీ ప్రత్యేక సుగుణాలన్నీ ఉన్న మానవుడు, అంతకు మించి మరెంకాదుయని స్పష్టం చేసెను.దేవుడు ఒక్కడే అని మహమ్మద్ నబీ చెప్పెను. మానవ సమాజం లో వాళ్ళుఎక్కువ వీళ్ళు తక్కువ అనేది లేదు అన్నాడు. ప్రజలమద్య భేదం లేదన్నాడు. అందరూ సమానులే అని అన్నాడు. విగ్రహారాధనను వ్యతిరేకించినాడు. ఐక్యత, సహోదరత్వ ప్రమాణాలను పాటించమన్నాడు. పైగా నేను చెప్పినవాటిలో దేనిమీదైన మీకు అనుమానాలు ఉన్న వాటిని మీ సొంత విశ్లేషణతో పరిశోదించండి అని మహమ్మద్ నబీ పేర్కొన్నాడు.  మానవ సామాజిక జీవనానికి సంబంధించిన అన్నీ రంగాలలో అత్యున్నత తాత్విక నిర్దేశాలను మహమ్మద్ నబీ రూపొందించాడు. కొన్ని వందల సం.ల క్రిందటే ఆర్థిక రంగానికి సంబంధించిన అరుదైన, విలువైన భావాలు(జకాత్) వెల్లడించాడు. ఆర్థిక రంగంలో మహమ్మద్ నబీ ప్రవచించిన సూక్తులు అద్భుతమైనవి. మహమ్మద్ నబీ ప్రవచించిన ఈ సూత్రాలను,విషయాలను మనమంతా గ్రహించి  వాటిని అనుసరించాలి.

          ఈ విధంగా పెరియార్ ఇస్లాం పై తన ఉపన్యాసాల ద్వారా సర్వ మానవ సమానత్వాన్ని, సౌబ్రాత్రు త్వాన్నిప్రబోదించే ఇస్లాం మతాన్ని కీర్తించినాడు. హిందూ సమాజం లో దోపిడీకి గురిఔతున్న అణగారిన ద్రావిడ,అతిద్రవిడ వర్గాలకు ఇస్లాం మినహా మరో మార్గం లేదన్నాడు. అంటరానితనాన్ని నిర్మూలించాలని కోరుకొనేవాళ్లూ, అంటరానివాళ్లు అన్న ముద్రనుంచి బయటపడాలనుకునేవాళ్లు, ముస్లింలుగా మారాలని పెరియార్ ఆయా కులాలకు సూచించేను. జాతిపరమైన హెచ్చు తగ్గులకు ఇస్లామే సరైన విరుగుడుఅని అన్నాడు. ఆయన ఉద్దేశంలోఇస్లాం ద్రావీడులకు కొత్త సిద్ధాంతం కాదు.  ప్రాచీన ద్రావిడ మత సిద్దాంతలకు ప్రతి రూపమే ఇస్లాం .శాంతి, సమైక్యత, పరస్పర గౌరవం, భక్తిభావం, సహోదరత్వం వంటి లక్షణాలు కలిగిన ద్రావిడ “కాడవూల్”కు ప్రతిరూపమే అరబ్బీలో అల్లాహ్ . శాంతి, నిజమైన సౌబ్రాతృత్వం,సమైక్యత, క్రమశిక్షణతో కూడిన జీవన మార్గం ఇస్లాం అని పెరియార్ అభిప్రాయపడినాడు. ఆర్థిక రంగంలో మహమ్మద్ నబీ ప్రవచించిన సూక్తులు అద్భుతమైనవి, అనుసరించదగినవి అని అన్నాడు. 

          అయితే కొన్ని సంధార్భాలలో పెరియార్ అల్పసంఖ్యాకులకు వ్యతిరేకంగా కూడా అభిప్రాయాలు వ్యక్తపరిచేను. అనైముత్తు రచించిన “పెరియార్ ఈ‌వి‌ఆర్ సింథనైగల్” గ్రంధం లోపెరియార్ వ్యాఖ్యలు  క్రింది విధంగా ఉదహరించబడేను  “ మనం బ్రాహ్మణులు గురించి భయపడ్డాము,ముస్లింలను ఆదరించాము.దాని ఫలితాలను ఈరోజు అనుభవిస్తున్నాము. సామెత చెప్పినట్లు పేడ ను వదిలి మలంలో కాలు వేసినట్లు ఉంది. ముస్లింలకు నైష్పత్తిక ప్రాతినిద్యం లబించినది, షెడ్యూల్ కులాలకు విద్యా,ఉపాధులలో రిజర్వేషన్లు లబించినవి, మిగతావి  బ్రాహ్మణులకు లబించినవి.  ఇక శూద్రులకు భవిషత్ ఎక్కడ ఉంది?” అదేవిధంగా 1954 లో పెరియార్ తమిళనాడు లోని ముస్లింలను, క్రైస్తవులను తమిలేతరులుగా(Non-Tamils)గా వర్ణించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసెను.
   
మూలాధారాలు:
1.వికీపీడియా
2. పెరియర్ర్ దృష్టి లో ఇస్లాం – జి. ఆలాయ్ సియాస్













No comments:

Post a Comment