12 August 2023

మూత్రపిండాల్లో రాళ్ళు (Kidney Stones)

 


మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పారదోలుటకు రక్తాన్ని వడకట్టుతాయి. మౌనంగా పనిచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు కొన్ని ముదిరిపోయేదాకా తెలియదు. ఎందుకంటే చివరిక్షణం వరకూ మూత్రపిండాలు పనిచేస్తాయి. ఆఖరుకు కిడ్నీ అంతా పాడైపోయినపుడే పనిచేయటం మానివేస్తాయి.

ఈ మధ్య మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటిశాతం తగ్గి, లవణాల గాఢత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉండడటమే.

మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మూత్రపిండాలు శరీర ద్రవాల్లోని లవణాల సమతుల్యత కాపాడి, శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గకుండా చూస్తు జీవక్రియ నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని విసర్జిస్తాయి.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణాలు :

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మూత్రవయావాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌. నీరు తగినంత తాగకపోవడం. ఆహారపు అలవాట్లు. కొన్ని జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్లు

మూత్రంలోని లవణాలు గట్టిపడి ఘనీభవించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. ఈ రాళ్ళు మూత్రప్రవాహాన్ని అడ్డగించినపుడు ఇన్‌ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలే కాకుండా మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా చోటుచేసుకోవచ్చు. జనాభాలో 4-8 శాతం మంది వ్యక్తులు మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్నారని అంచనా. దీనిని బట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య స్ర్తి పురుషుల్లో ఒకే మాదిరిగా కాకుండా కొద్దిపాటి తేడాలతో వ్యక్తమవుతుంది. ఉదాహరణకు పురుషుల విషయానికి వస్తే ప్రతి పదిమందిలోనూ ఒకరికి రాళ్లు వస్తాయి. అదే మహిళల్లో అయితే ప్రతి 35 మందిలోనూ ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

మూత్రంలో సహజంగా ఉండే కొన్ని రకాల జీవరసాయన పదార్థాలవల్ల రాళ్లు తయారవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఈ పదార్థాలు లోపిస్తే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యే ప్రక్రియను వైద్య పరిభాషలో యూరోలిథియాసిస్అంటారు. మూత్రపిండాల్లో తయారైన రాళ్లు, చిన్న ఆకృతిలో ఉంటే మూత్రప్రవాహం ద్వారా వెలుపలకు మూత్రంతో సహా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటి ఆకారం పెద్దగా తయారైతే మూత్రమార్గాన్ని అడ్డగించి తదనుగుణమైన సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల పరిమాణం నుంచి పెద్ద రేగు కాయంత పరిమాణం వరకూ తయారయ్యే అవకాశం ఉంది. ఇవి చూడ్డానికి నునుపుగాగాని లేక గగ్గురుగా గాని ఉండవచ్చు. సాధారణంగా పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. ఈ రాళ్లు ప్రాథమికంగా మూత్రపిండాల్లో తయారవుతాయి. అయితే తయారీ తరువాత స్వస్థానంలోనే కాకుండా మూత్రమార్గంలోని ఇతర ప్రదేశాల్లో కూడా పెరగవచ్చు.

మూత్రపిండాల్లో రాళ్లు-పరీక్షలు:

1. అల్ట్రాసౌండు - కడుపు పరీక్షలు

2. ఐ.వి.పి. (ఇంటావీనస్ ఫైలోగ్రామ్)

3. ‘X’ రే కడుపు మూత్రనాళము - మూత్రాశయ భాగాలు (కె.ము.బి)

4. యమ్.ఆర్.ఐ (MRI) కడుపు/మూత్రపిండాలు

5. మూత్ర పరీక్షలు

ఈ పరీక్షల వలన మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండ కణాలు దెబ్బతినడం, మూత్ర వ్యవస్ధ పనిచేయుట వ్యత్యాసం కనుగొనవచ్చును.

మూత్రపిండాల్లో రాళ్లు-నివారణ

రోజుకు 8-13 గ్లాసుల నీళ్లు తాగాలి.

కాల్షియం, ఆగ్జలేట్స్ కలిగిన ఆహారాలను తీసుకోవద్దు. ఉదాహరణకు యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, ఛీజ్, ద్రాక్ష, ఐస్‌క్రీమ్, విటమిన్ సి కలిగిన పండ్లు, పెరుగు, టమటా, కమలాపండ్లను మానేయటం గాని బాగా తగ్గించటం గాని చేయాలి.

ఆహారంలో జంతు మాంసాలను తగ్గించాలి.

ఉప్పు వాడకాన్ని కూడా రోజుకు 2-3 గ్రాములకు తగ్గించాలి.

విటమిన్-సి, డిలను సప్లిమెంట్ల రూపంలో యధేచ్చగా తీసుకోవద్దు.

మద్యం అలవాటు ఉంటే మానేయాలి.

మూత్రపిండాల్లో రాళ్లు చికిత్స

1. మూత్రపిండాలలో రాయి సైజు 5 mm లోపు వుందని నిర్దారించినపుడు, సాధారణంగా మూత్రం ద్వారా వెలుపలకు వస్తుంది*

2.శస్త్రచికిత్స :

కొన్ని మూత్రపిండాల్లోని రాళ్ళను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరం. మూత్రకోశ వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ శస్త్రచికిత్స చేయించుకుని, రాళ్ళను తొలగించుకోవాలి. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల పాటు ఆస్పత్రిలో వుండాలి. ఆరు నుండి పన్నెండు వారాల విశ్రాంతి అవసరం. తరువాత మూత్రపిండంలో రాళ్లు తయారవకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

3. ఐదు (5) mm కన్నా పెద్దగా వున్న రాళ్ళు తనంత తానుగా వెలుపలకు రావు కాబట్టి తప్పని సరిగా లితోట్రెప్సి ద్వారా కాని, ఆపరేషన్ ద్వారా కాని తీసివేయవలసిన అవసరం ఉంటుంది

4. యారెటరోస్మోపి, పర్ క్యూటీనియస్ నెఫ్రోలితోటమీ, లితోక్లాస్ట్, లేజర్స్ అనే అధునాతన పద్దతుల ద్వారా మూత్రపిండాల రాళ్లను తీసివేయవచ్చును

కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను పగలగొట్టేందుకు మరోపద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒక ట్యూబును కిడ్నీలోనికి లోతుగా పంపి దాని మొనభాగాన్ని అతి వేగంగా త్రిప్పుతారు. దాని నుండి అతి ధ్వని ప్రకంపనాలు వెలువడతాయి. దీనివల్ల రాళ్ళు చిన్నముక్కలుగా పగిలిపోతాయి. వాటిని ఆపరేషన్‌ ద్వారా తీస్తారు. దీనినే 'పర్క్యుటేనియస్‌ సెప్రోలిథోటోనమి' అని అంటారు. ఈ చికిత్సలో రోగి శరీరానికి గాటుపెట్టడం జరుగుతుంది. 

ఈ చికిత్స చేయాలంటే రోగికి మత్తు కలిగించే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ద్వారా చేస్తూ విద్యుదయస్కాంత తరంగాలను కావలసిన చోటికి పంపుతారు. టాన్యుడ్యూజర్‌ ద్వారా సుమారు నూరు స్పందనాలను ఒక్కసారిగా రోగిలోనికి పంప బడతాయి. తరంగాలు ఒకదాని వెనుక ఒకటి శీఘ్రంగా పంపితే దానివల్ల సుమారు 100 పీడనాల వత్తిడి కిడ్నీలో రాళ్ళున్న ప్రాంతంపై కలుగుతుంది. దానివల్ల కిడ్నీల్లో ఏర్పడ్డ రాళ్ళుబ్రద్ధలై చిన్నముక్కలవుతాయి. కొన్ని లక్షలకు పైగా రోగులు ఈ ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్‌టర్‌ పద్ధతి వల్ల ప్రయో జనం పొందారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది. మనం ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవు.

 హోమియో మందులు తో పూర్తి నివారణ సాద్యం

 

No comments:

Post a Comment