30 June 2020

హైదరాబాద్ ప్రగతిశీల యువరాణి-ప్రిన్సెస్ దుర్రు షెహ్వార్ The progressive princess of Hyderabad -Princess Durru Shehvar

















హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కోడలు  దుర్రు షెహ్వర్ పేరు హైదరాబాద్‌లో ఆమె చేసిన సామాజిక మరియు దాతృత్వ కృషికి గుర్తుండిపోతుంది. ఒట్టొమాన్ సామ్రాజ్యానికి యువరాణి అయిన ప్రిన్సెస్ దుర్రు షెహ్వర్ టర్కీలో జన్మించారు, ఫ్రాన్స్‌ లో పెరిగారు మరియు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన హైదరాబాద్ నిజాం కుమారుడిని వివాహం చేసుకున్నారు.యువరాణి దుర్రు షెహ్వర్ హైదరాబాద్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసింది.

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు ప్రిన్స్  అజామ్ జా బహదూర్‌తో ఆమె వివాహం ఫలితంగా టర్కీ ఖలీఫా  మరియు హైదరాబాద్‌కు చెందిన అసఫ్ జాహి కుటుంబాల మద్య వియ్యం  ఏర్పడింది. టర్కీకి చెందిన ఖలీఫా  అబ్దుల్ మజ్జిద్ II యొక్క ఏకైక కుమార్తె దుర్రు షెహ్వర్ 1914 లో జన్మించారు  మరియు ఆధునిక విద్యలో  యుద్ధ కళలలో శిక్షణ పొందారు  మరియు ఆమె తండ్రి తరువాత అధికారం లోకి రావాలని అనుకున్నారు.

నిజాం మరియు ఖలీఫా :
టర్కీ రిపబ్లిక్ అయిన తరువాత మార్చి 1924లో ఖలీఫా పదవి  రద్దు చేయబడింది మరియు రాజ కుటుంబం టర్కీ నుండి బహిష్కరించబడింది. అబ్దుల్ మజ్జిద్ మరియు అతని కుటుంబం దక్షిణ ఫ్రెంచ్ మధ్యధరా ఓడరేవు నగరమైన నైస్‌లో స్థిరపడ్డారు. పదవీచ్యుతుడైన పాలకుడితో స్నేహపూర్వకంగా ఉన్న బ్రిటిష్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం పాలకులను  ఖలీఫా కు ఆర్ధిక సహాయం చేయమని విజ్ఞప్తి చేసింది. మౌలానా షౌకత్ అలీ మరియు అతని సోదరుడు మౌలానా మొహమ్మద్ అలీ విజ్ఞప్తి మేరకు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పదవీచ్యుతుడైన ఖలీఫాకు  జీవితకాల నెలవారీ పింఛను 300 పౌండ్లు పంపాలని నిర్ణయించుకున్నారు  మరియు ఖలీఫా కుటుంబంలోని అనేక మంది వ్యక్తులకు అలవెన్స్  ఇచ్చారు.

దుర్రు షెహ్వర్ యుక్త వయస్సుకు  వచ్చినప్పుడు, ఆమె తో వివాహం కోసం పర్షియా షా మరియు ఈజిప్ట్ రాజుతో సహా అనేకమంది  ముస్లిం రాజులు తమ యువరాజుల కోసం  వివాహ ప్రతిపాదనలు పంపారు. తన పెద్ద కుమారుడు ప్రిన్స్ అజమ్ జా కోసం దారు షెవర్ చేతిని కోరుతూ ఖలీఫాకు   ఒక ప్రతిపాదన పంపమని మౌలానా షౌకత్ అలీ నిజాంపై ఒత్తిడి తెచ్చారు. పదవీచ్యుతుడైన ఖలీఫా  తన లబ్ధిదారుడి నుండి వచ్చిన వివాహ ప్రతిపాదనను  తిరస్కరించలేదు.

కానీ అది అంత సులభం కాదు; ఖలిఫా తన కుమార్తె కోసం కోరిన 50,000 పౌండ్ల మెహర్ (వధువు డబ్బు) చాలా పెద్దదిఅని నిజాం భావించాడు. కానీ షౌకత్ అలీ జోక్యంతో, ఖలీఫా  తన సోదరుడి కుమార్తె నీలౌఫర్ చేతిని  అదే మెహర్ కోసం నిజాం చిన్న కుమారుడు ప్రిన్స్ మౌజామ్ జా Mauzam Jah కోసం ప్రతిపాదించాడు. నిజాం వెంటనే అంగీకరించి తన ఇద్దరు కుమారులు ఫ్రాన్స్‌ కు పంపాడు.

ప్రిన్స్ అజామ్ జా Azam Jah తో యువరాణి దుర్రు షెహ్వర్ వివాహం మరియు  ప్రిన్స్ మౌజామ్ జా Mauzam Jah తో యువరాణి నిలోఫర్ల  వివాహం  1931 నవంబర్ 12 న ఫ్రాన్స్‌ లోని నైస్‌లో జరిగింది,  సుల్తాన్ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఈ వివాహాలు నిరాడంబరంగా జరిగినవి.  కొంతమంది టర్కిష్ ప్రభువులు మరియు స్నేహితులు మరియు నిజాం ప్రతినిధులు - సర్ అక్బర్ హైదరి మరియు నవాబ్ మెహదీ యార్ జంగ్ హాజరయ్యారు. ఖలీఫా స్వయంగా వేడుకలు నిర్వహించారు. నిజాం ఆధిపత్యంలోని అన్ని కార్యాలయాలు మరియు విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు ఇవ్వబడింది


మహాత్మగాంధిని  కలవడం
నైస్‌లో ఒక నెల ఉత్సవాల తరువాత, యువరాజులు డిసెంబర్ 12, 1931 న వెనిస్ నుండి భారతదేశానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఓడలో మహాత్మా గాంధీ కూడా ఉన్నారు, గాంధీజీ లండన్‌లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి  హాజరై తిరిగి వస్తున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీజీ తో పాటు  పాల్గొన్న షౌకత్ అలీ, బహిష్కరించబడిన ఖలీఫా  పట్ల గాంధీజీ  యొక్క సానుభూతిని తెలుసుకొని ఓడ పై గాంధీజీ తో కలిసి యువ హైదరాబాదీ రాజకుటుంబం యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఇక్కడ ఒక సమస్య తలయెత్తింది. III తరగతిలో ప్రయాణిస్తున్న గాంధీజీ  ఫస్ట్ క్లాసు లోకి రాలేరు. రాచరిక యువ జంటలు తాము బస చేసిన ఫస్ట్ క్లాస్ నుంచి గాంధీజీ  బస చేసిన III తరగతికి వెళ్లడానికి ఇష్టపడలేదు. అయితే షౌకత్ అలీ, ఒక రాజీ ప్రతిపాదన చేసారు. గాంధీజీ  మరియు కొత్తగా పెళ్లి చేసుకున్న వారి సమావేశం II తరగతిలోని  ఒక లాంజ్లో జరిగింది.


హైదరాబాద్‌లో దుర్రు షెహవర్ సామాజిక కార్యకలాపాలు:

హైదరాబాద్‌లో దుర్రు షెహవర్ త్వరలోనే ప్రజలతో మమేకమైనారు. సామాన్య ప్రజలకు  ఆరోగ్య సంరక్షణ మరియు విద్యను  అందించడం కోసం  ఆమె పురాన హవేలీలో ఒక జనరల్ మరియు పిల్లల ఆసుపత్రిని ఏర్పాటు చేసింది, అది ఇప్పటికీ ఆమె పేరు మీదనే నడుస్తుంది. బాలికల విద్యని ప్రోత్సహించడానికి స్కూళ్లు తెరిపించారు. యాకుత్పురాలోని బాగ్-ఎ-జహానారాలో బాలికల కోసం జూనియర్ కళాశాల ఆమె అందించిన నిధులతో  నడుస్తుంది. అక్కడ బాలికలకోసం నర్సింగ్, లాబ్ టేక్నీషియన్ కోర్సులు నడుస్తున్నాయి. ప్రసిద్ద  ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) లోని అజ్మల్ ఖాన్ టిబ్బియా కళాశాల ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు.

నిజాం ఆమెను తన విలువైన జ్యువెల్ (నగినా) అని పిలిచెవారు  మరియు హైదరాబాద్ సామాజిక జీవితంలో చురుకుగా పాల్గొనమని ఆమెను ప్రోత్సహించారు. ఆమె తన స్నేహితురాలు  రాణి కుముదిని దేవితో కలిసి, గుర్రపు స్వారి చేసేది. కార్లు నడిపింది మరియు టెన్నిస్ ఆడింది. ఆమె తన అందం, ఆకర్షణ, మర్యాద మరియు ఆధునిక వేషధారణ తో  హైదరాబాద్ యొక్క సామాజిక జీవితం పై గాఢమైన ప్రభావాన్ని ఏర్పరచినది.

దుర్రు షెహ్వార్ 1936 లో బేగంపేట విమానాశ్రయ భవనానికి పునాది రాయి వేశారు. అప్పటి వరకు హకీంపేట వద్ద ఒక చిన్న స్ట్రిప్ హైదరాబాద్ విమానాశ్రయంగా పనిచేసేది. ఆమె తన కుమారులు, ప్రిన్స్ ముకారామ్ జాహ్ Mukarram Jah మరియు ప్రిన్స్ ముఫాకం జా Muffakam Jah, ఐరోపాలో ఉత్తమమైన పాశ్చాత్య విద్యను పొందాలని మరియు టర్కిష్ వధువులను వివాహం చేసుకోవాలని కోరుకొన్నారు.  ముకారామ్ Mukarram భారతదేశపు మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చదివిన ఏటన్ లో చదువుకున్నారు మరియు హైదరాబాద్ సింహాసనం కు వారసుడిగా ప్రకటింపబడిన  ముకర్రామ్   కొన్నేళ్ల తరువాత, తన తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సూచన మేరకు ప్రధానమంత్రి నెహ్రూకు గౌరవ ఎయిడ్-డి-క్యాంప్ (ఎడిసి) గా పనిచేశారు.

దుర్రు షెహ్వర్ ఫ్రెంచ్, ఇంగ్లీష్, టర్కిష్ మరియు ఉర్దూ భాషలలో నిష్ణాతులు మరియు ఫ్రెంచ్ పత్రికలకు వ్యాసాలు కూడా రాసేవారు. మహిళలు ఆర్ధికంగా స్వావలంబన సాధించాలనీ ఆమె నమ్మారు  మరియు పర్దా ప్రాక్టిస్ ను తొలగించడానికి చాలా కృషిచేసారు మరియు తన జీవితకాలం బురఖాని ధరించకుండా రాజరిక మర్యాదలు, సమావేశాల్లో పాల్గొన్నారు. బురఖా నిషేధం కోసం ఈ దేశంలో పోరాడిన మహిళ ఆమె.  ఏదేమైనా, యువరాణి దుర్రు షెహ్వర్ మరియు యువరాజు అజామ్ జా మధ్య గొప్ప అగాధం ఉంది, మరియు వారి వివాహం కొన్ని సంవత్సరాల తరువాత  విడిపోయింది.

 ఆమె వివాహం తరువాత, హైదరాబాద్ రాజ్యం  1948 లో రద్దు చేయబడింది మరియు ఇండియన్ యూనియన్‌లో  కలిసిపోయింది. ఆమె కీర్తి మరియు శక్తితో పాటు విరోధo, స్థానభ్రంశం మరియు వేదనను ఎదుర్కొంది. కాని  తన పనులతో హైదరాబాద్‌లో ప్రజల హృదయాలను గెలుచుకుంది.ఆమె తన వయోజన జీవితం లో ఎక్కువ సమయం హైదరాబాద్ లో గడిపింది. హైద్రాబాద్, లండన్ మధ్య జీవితం గడిపారు. హైదరాబాదు సంస్థానంలో మరియు  నిజాం కుటుంబంలో ఆధునికతకు, హేతుబద్దతకూ దోహదపడ్డారు.

యువరాణి దుర్రు షెహ్వర్ తన చివరి సంవత్సరాలను లండన్‌లో గడపాలని అనుకోన్నారు. యువరాణి దుర్రు షెహ్వర్, శాశ్వతంగా లండన్కు మారిన తరువాత  హైదరాబాద్ నగరానికి తరచూ వచ్చేవారు. ఆమె నగరానికి చివరిసారిగా 2004 లో అనగా  తన 92 సంవత్సరాల వయసులో లండన్లో కన్నుమూయడానికి రెండు సంవత్సరాల ముందు వచ్చారు.  ఆమె మరణంతో హైదరాబాద్ యొక్క అద్భుతమైన అధ్యాయం ముగిసింది.

ఆధారం:

1.దిహిందూ పత్రిక
2. వికిపిడియా

No comments:

Post a Comment